టీమిండియా వెటరన్ బ్యాటర్స్ చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానేలకు మళ్లీ నిరాశే ఎదురైంది. సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరగనున్న టెస్ట్ సిరీస్లో ఈ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్కు చోటు దక్కలేదు. దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో పుజారా సెంచరీతో రాణించినా సెలెక్టర్లు పట్టించుకోలేదు. ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా తొలి రెండు మ్యాచ్ల కోసం అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ శుక్రవారం భారత జట్టును ప్రకటించింది.
16 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో ఉత్తరప్రదేశ్ కుర్రాడు, రాజస్థాన్ రాయల్స్ యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్కు అవకాశం దక్కింది. దాదాపుగా సౌతాఫ్రికాతో తలపడినే జట్టునే సెలెక్టర్లు కొనసాగించారు. చీలమండ గాయం నుంచి కోలుకుంటున్న మహమ్మద్ షమీ ఈ సిరీస్కు కూడా ఎంపికవ్వలేదు.

వ్యక్తిగత కారణాలతో సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ నుంచి వైదొలిగిన ఇషాన్ కిషన్ను సెలెక్టర్లు పట్టించుకోలేదు. అతని స్థానంలోనే ధ్రువ్ జురెల్కు అవకాశం కల్పించారు. అతను తొలిసారి టీమిండియా పిలుపును అందుకున్నాడు. ప్రధాన వికెట్ కీపర్గా తెలుగు తేజం కేఎస్ భరత్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కానీ రాహులే వికెట్ కీపింగ్ చేసే అవకాశం ఉంది.
రంజీ ట్రోఫీలో గాయపడిన ప్రసిధ్ కృష్ణ స్థానంలో ఆవేశ్ ఖాన్కు అవకాశం దక్కింది. స్పిన్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్లతో పాటు కుల్దీప్ యాదవ్ ఎంపికయ్యాడు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, మకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్ పేస్ విభాగాన్ని నడిపించనున్నారు.

ఈ నెల 25న హైదరాబాద్ వేదికగా ప్రారంభమయ్యే తొలి టెస్ట్తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మకు బుమ్రా డిప్యూటిగా వ్యవహరించనున్నాడు.
ఇంగ్లండ్తో తొలి రెండు టెస్ట్లకు భారత జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఆవేశ్ ఖాన్.