న్యూఢిల్లీ: వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న భారత టెస్ట్, వన్డే జట్లను బీసీసీఐ ప్రకటించింది. 16 మంది సభ్యులతో కూడిన టెస్ట్, వన్డే జట్ల వివరాలను ఆలిండియా సెలెక్షన్ కమిటీ శుక్రవారం వెల్లడించింది. అంతా ఊహించినట్లుగానే టెస్ట్ టీమ్ నుంచి చతేశ్వర్ పుజారా, ఉమేశ్ యాదవ్లు ఉద్వాసనకు గురవ్వగా.. ఐపీఎల్లో సత్తా చాటిన రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్కు అవకాశం దక్కింది.
సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్లను కొనసాగించిన బీసీసీఐ మహమ్మద్ షమీకి ఒక్కడికే విశ్రాంతినిచ్చింది. డబ్ల్యూటీసీ ఫైనల్లో దారుణంగా విఫలమైన ఉమేశ్ యాదవ్ స్థానంలో నవ్దీప్ సైనీని ఎంపిక చేసింది. మహమ్మద్ షమీకి రిప్లేస్మెంట్గా యువ పేసర్ ముఖేశ్ కుమార్కు అవకాశం ఇచ్చింది.

వికెట్ కీపర్గా తెలుగు తేజం కేఎస్ భరత్కు మరో అవకాశం ఇచ్చిన సెలెక్టర్లు అతనికి బ్యాకప్గా ఇషాన్ కిషన్ను తీసుకున్నారు. ఆల్రౌండర్లుగా జడేజాతో పాటు అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ చోటు దక్కించుకోగా.. జయదేవ్ ఉనాద్కత్ను కూడా కొనసాగించారు. ఓపెనర్గా శుభ్మన్గిల్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
కశ్మీర్ సెన్సేషన్ ఉమ్రాన్ మాలిక్కు అవకాశం దక్కుతుందని ప్రచారం జరిగినా.. సెలెక్టర్లు అతన్ని పట్టించుకోలేదు. పేలవ ప్రదర్శనతో వేటుకు గురై.. ఐపీఎల్ ప్రదర్శనతో జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన అజింక్యా రహానేకు మళ్లీ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. గతంలో వైస్ కెప్టెన్గా ఉన్న రహానేను ఆ బాధ్యతలను తప్పించి జట్టుకు దూరం చేసిన సెలెక్టర్లు మళ్లీ అతనికే ఆ బాధ్యతలు ఇవ్వడం గమనార్హం.
జూలై 12 నుంచి మొదలయ్యే ఈ సుదీర్ఘ పర్యటనలో టీమిండియా ఆతిథ్య వెస్టిండీస్తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.
వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న భారత టెస్ట్ టీమ్:
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్యా రహానే(వైస్ కెప్టెన్), కేఎస్ భరత్(కీపర్), ఇషాన్ కిషన్(కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, ముఖేశ్ కుమార్, జయదేవ్ ఉనాద్కత్, నవదీప్ సైనీ.