ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. శనివారం ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో బోర్డ్ సెక్రటరీ దేవజిత్ సైకియా అధ్యక్షతన జరిగిన టీమ్ సెలెక్షన్ సమావేశంలో టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, సెలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 15 మంది సభ్యులతో కూడిన భారత టీ20 ప్రపంచకప్ జట్టు వివరాలను చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించారు.
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడిన జట్టులో మూడు మార్పులు చేశారు. టీ20 ఫార్మాట్లో వరుసగా విఫలమైన శుభ్మన్ గిల్పై వేటు పడింది. వికెట్ కీపర్ జితేష్ శర్మపై వేటు వేసిన సెలెక్టర్లు ..సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఇషాన్ కిషన్ను బ్యాకప్ వికెట్ కీపర్గా ఎంపిక చేశారు. రింకూ సింగ్ రీఎంట్రీ ఇవ్వగా.. అక్షర్ పటేల్కు వైస్ కెప్టెన్సీ దక్కింది.

టీమ్ కాంబినేషన్లో భాగంగానే శుభ్మన్ గిల్, జితేష్ శర్మలను పక్కనపెట్టామని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోనే భారత జట్టు టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగుతుందని అగార్కర్ స్పష్టం చేశాడు.
బ్యాటర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ చోటు దక్కించుకోగా.. పేస్ ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. అక్షర్ పటేల్తో పాటు వాషింగ్టన్ సుందర్కు స్పిన్ ఆల్రౌండర్లుగా చోటు దక్కించుకున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తీ, కుల్దీప్ యాదవ్ తమ స్థానాలను నిలబెట్టుకోగా.. రింకూ సింగ్ రీఎంట్రీ ఇచ్చాడు. స్పెషలిస్ట్ పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణాలు అవకాశాన్ని అందుకున్నారు.