న్యూజిలాండ్తో మూడు టెస్ట్ల సిరీస్ ఆడే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను అజిత్ అగార్కర్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ శుక్రవారం వెల్లడించింది. ఇటీవలే బంగ్లాదేశ్తో రెండు టెస్ట్ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన జట్టునే దాదాపు కొనసాగించింది.
యువ పేసర్ యశ్ దయాల్ గాయపడటంతో అతన్ని జట్టు నుంచి తప్పించారు. ఈ ఒక్కటి మినహా ఎలాంటి మార్పు చేయలేదు. రెండో టెస్ట్ ముంగిట దులీప్ ట్రోఫీ కోసం విడుదలైన సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ తిరిగి జట్టుకు ఎంపికయ్యారు.

వైస్ కెప్టెన్గా బుమ్రా..
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను వైస్ కెప్టెన్గా ప్రకటించారు. బంగ్లాదేశ్తో సిరీస్లో వైస్ కెప్టెన్ను నియమించలేదు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలోనే వైస్ కెప్టెన్ను నియమించినట్లు తెలుస్తోంది. ఈ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో టీమిండియా ఐదు టెస్ట్ల సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే.
ఈ సిరీస్ కోసం నవంబర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అయితే ఈ సిరీస్ తొలి రెండు టెస్ట్ల్లో ఒక మ్యాచ్కు రోహిత్ శర్మ దూరం కానున్నట్లు వార్తలు వచ్చాయి. వ్యక్తిగత పనుల మీద అతను అందుబాటులో ఉండనని బీసీసీఐకి సమాచారమిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే బుమ్రాను వైస్ కెప్టెన్గా నియమించినట్లు తెలుస్తోంది. రోహిత్ గైర్హాజరీలో అతనే జట్టును నడిపించనున్నాడు.

రిజర్వ్ ప్లేయర్గా నితీష్ కుమార్ రెడ్డి ..
తెలుగు తేజం, యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్కు ఎంపిక చేస్తారని ప్రచారం జరిగినా.. సెలెక్టర్లు అతన్ని రిజర్వ్ ప్లేయర్ జాబితాలో చేర్చారు. టెస్ట్ టీమ్లో ఎలాంటి మార్పులు చేయలేదు. రిషభ్ పంత్కు బ్యాకప్ వికెట్ కీపర్గా ధ్రువ్ జురెల్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న అభిమన్యు ఈశ్వరన్ను కూడా సెలెక్టర్లు పట్టించుకోలేదు. గాయంతో గతేడాదిగా జట్టుకు దూరంగా ఉంటున్న మహమ్మద్ షమీ ఈ సిరీస్కు కూడా ఎంపికవ్వలేదు.
అక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. బెంగళూరు వేదికగా అక్టోబర్ 20 వరకు తొలి టెస్ట్ జరగనుండగా.. అక్టోబర్ 24-28 పుణే వేదికగా రెండో టెస్ట్.. నవంబర్ 1 నుంచి 5 వరకు వాంఖడే వేదికగా చివరి టెస్ట్ జరగనుంది.
న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్కు ఎంపికైన భారత జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా(వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్