న్యూఢిల్లీ: వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న భారత టెస్ట్, వన్డే జట్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. 16 మంది సభ్యులతో కూడిన టెస్ట్, 17 మంది ప్లేయర్లతో కూడిన వన్డే జట్ల వివరాలను ఆలిండియా సెలెక్షన్ కమిటీ శుక్రవారం వెల్లడించింది. అంతా ఊహించినట్లుగానే టెస్ట్ టీమ్లో సంచలన మార్పులు చోటు చేసుకున్నా.. వన్డే టీమ్లో మాత్రం పెద్దగా మార్పులు జరగలేదు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో దారుణంగా విఫలమైన చతేశ్వర్ పుజారా, ఉమేశ్ యాదవ్లను టెస్ట్ టీమ్ నుంచి వేటు వేసిన సెలెక్షన్ కమిటీ.. వన్డే టీమ్లో మాత్రం పెద్దగా మార్పులు చేయలేదు. గాయాలతో జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ స్థానాల్లో రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్లను తీసుకుంది.

వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్ను కొనసాగించిన సెలెక్టర్లు.. మహమ్మద్ షమీకి వన్డే సిరీస్ నుంచి కూడా విశ్రాంతి కల్పించారు. ఐపీఎల్లో సత్తా చాటిన ముఖేశ్ కుమార్తో పాటు సన్రైజర్స్ సంచలనం ఉమ్రాన్ మాలిక్కు అవకాశం కల్పించారు. జయదేవ్ ఉనాద్కత్ కూడా చాలా రోజుల తర్వాత వన్డే టీమ్ పిలుపును అందుకున్నాడు.
రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఓపెనర్లుగా ఎంపికవ్వగా.. బ్యాకప్ బ్యాటర్గా రుతురాజ్ జట్టులోకి వచ్చాడు. కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ మిడిలార్డర్ బాధ్యతలు మోయనుండగా.. హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ ఆల్రౌండర్లుగా ఎంపికయ్యారు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్తో పాటు స్పెషలిస్ట్ స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చారు. గాయం నుంచి కోలుకున్న దీపక్ చాహర్ను సెలెక్టర్లు పట్టించుకోలేదు.
టెస్ట్ టీమ్కు ఎంపిక చేసిన యశస్వి జైస్వాల్కు వన్డేల్లో అవకాశం ఇవ్వలేదు. సంజూ శాంసన్ రీఎంట్రీ ఇవ్వడంతో కేఎస్ భరత్ వన్డే జట్టులో చోటు కోల్పోయాడు. జూలై 12 నుంచి మొదలయ్యే ఈ సుదీర్ఘ పర్యటనలో టీమిండియా ఆతిథ్య వెస్టిండీస్తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.
త్వరలోనే టీ20 సిరీస్ బరిలోకి దిగే భారత జట్టును ఎంపిక చేయనున్నారు.
వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న భారత వన్డే టీమ్:
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్(కీపర్), హార్దిక్ పాండ్యా(వైస్కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, ముఖేశ్ కుమార్, జయదేవ్ ఉనాద్కత్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్