ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ గెలిచిన సంతోషంలో ఉన్న భారత ఆటగాళ్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) బంపరాఫర్ ప్రకటించింది. టెస్ట్ క్రికెట్ ఆడే ఆటగాళ్లకు ప్రోత్సహకాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జై షా.. ఆటగాళ్ల ఇన్సెంటీవ్ వివరాలను సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
ఆయన ప్రకటన ప్రకారం.. ఏడాది కాలంలో ఓ ఆటగాడు సగం కంటే ఎక్కువ టెస్ట్లు ఆడితే ప్రతీ మ్యాచ్కు రూ. 30 లక్షల చొప్పున ఇన్సెంటీవ్ అందుకోనున్నాడు. 75 శాతం కంటే ఎక్కువ టెస్ట్లు ఆడితే ప్రతీ మ్యాచ్కు రూ. 45 లక్షల చొప్పున అధిక వేతనాన్ని తీసుకోనున్నాడు. తుది జట్టులో ఆడని ఆటగాళ్లు 50 శాతం ఎక్కువ మ్యాచ్ల్లో జట్టుతో ఉంటే ఒక్కో టెస్ట్కు రూ. 15 లక్షలు.. 75 శాతం కంటే ఎక్కువ మ్యాచ్ల్లో బెంచ్కు పరిమితమైతే రూ. 22.5 లక్షలు అందుకోనున్నారు.

సగం కంటే తక్కువ మ్యాచ్లు ఆడితే మాత్రం ఈ ఇన్సెంటీవ్ రాదు. టెస్ట్ క్రికెట్కు కుర్రాళ్లు ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జై షా తన పోస్ట్లో పేర్కొన్నారు.
'భారత మెన్స్ క్రికెటర్ల కోసం టెస్ట్ క్రికెట్ ఇన్సెంటీవ్ స్కీమ్ ప్రారంభించామని చెప్పేందుకు సంతోషిస్తున్నాను. ఇది భారత ఆటగాళ్ల అర్థిక వృద్ధి, నిలకడను ఉద్దేశించి తీసుకున్న నిర్ణయం. 2022-23 సీజన్ నుంచే ఈ స్కీమ్ను అమలు చేయాలనుకుంటున్నాం. ఈ స్కీమ్లో భాగంగా ప్రస్తుతం ఉన్న మ్యాచ్ ఫీజులకు అదనంగా క్యాష్ రివార్డ్స్ అందజేస్తాం. కనీస ఇన్సెంటీవ్గా రూ. 15 లక్షలను నిర్ణయించాం.'అని జై షా పేర్కొన్నాడు.
జై షా పోస్ట్ ప్రకారం ఓ సీజన్లో భారత్ 9 టెస్ట్లోఆడితే.. అందులో 5 లేదా 6 మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లకు ప్రతీ మ్యాచ్కు రూ. 30 లక్షల చొప్పున, 7 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లకు రూ. 45 లక్షల చొప్పున ఇన్సెంటీవ్ రూపంలో లభిస్తోంది. 4 మ్యాచ్లు ఆడినా.. ఈ ఇన్సెంటీవ్ లభించదు.
ధర్మశాల వేదికగా శనివారం ముగిసిన ఆఖరి టెస్ట్లో టీమిండియా ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో సిరీస్ను 4-1తో కైవసం చేసుకుంది. 259 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. రవిచంద్రన్ అశ్విన్(5/77) ధాటికి 195 పరుగులకే కుప్పకూలింది.
జో రూట్(128 బంతుల్లో 12 ఫోర్లతో 84) ఒక్కడే ఒంటరి పోరాటం చేయగా.. జానీ బెయిర్ స్టో(31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 39) పర్వాలేదనిపించాడు.
మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. అశ్విన్కు అండగా.. జస్ప్రీత్ బుమ్రా(2/38), కుల్దీప్ యాదవ్(2/40) రెండేసి వికెట్లు పడగొట్టారు. రవీంద్ర జడేజాకు ఓ వికెట్ దక్కింది.
అంతకుముందు 473/8 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్.. 4 పరుగుల వ్యవధిలో చివరి రెండు వికెట్లు కోల్పోయి 477 పరుగులకు ఆలౌటైంది. రోహిత్(103), శుభ్మన్ గిల్(110) సెంచరీలతో రాణించగా.. దేవదత్ పడిక్కల్(65), సర్ఫరాజ్ ఖాన్(56), యశస్వి జైస్వాల్(57) హాఫ్ సెంచరీలతో రాణించారు. షోయబ్ బషీర్(5/173) ఐదు వికెట్లతో సత్తా చాటాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 218 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.