హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ఐదు టీ20ల సిరీస్, భారత్- ఇంగ్లండ్ మధ్య జరగనున్న ఐదు టీ20ల సిరీస్ల్లోని మ్యాచ్లకు హైదరాబాద్, వైజాగ్ క్రికెట్ స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అంతర్జాతీయ మ్యాచ్ల కోసం నిరీక్షిస్తున్న తెలుగు రాష్ట్రాల అభిమానులకు ఈ నాలుగు మ్యాచ్లు ప్రత్యక్షంగా చూసే అవకాశం దక్కనుంది.
అప్కమింగ్ సీజన్లో సొంతగడ్డపై జరగనున్న మ్యాచ్ల వివరాలు, వేదికలను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. సొంతగడ్డపై భారత జట్టు ఆడనున్న 16 అంతర్జాతీయ మ్యాచ్ల వివరాలను మంగళవారం వెల్లడించింది. ఇందులో ఐదు టెస్ట్లు, మూడు వన్డేలతో పాటు 8 టీ20లు ఉన్నాయి.

అమితాబ్ విజయ్వారిగ్య, జయేంద్ర సెహ్గల్, హరినారయణ్ పుజారీలతో కూడిన బీసీసీఐ టూర్స్, ఫిక్చర్స్, టెక్నికల్ కమిటీ సొంతగడ్డపై భారత్ ఆడబోయే మ్యాచ్ వేదికలను వెల్లడించింది. రొటేషన్ పాలసీలో భాగంగా ఈ వేదికలను ఖరారు చేసినట్లు పేర్కొంది.
వన్డే ప్రపంచకప్ ముందు ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్తో టీమిండియా హోమ్ సీజన్ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 22 నుంచి 27 వరకు జరిగే మూడు వన్డేల సిరీస్కు మొహాలి, ఇండోర్, రాజ్కోట్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అనంతరం అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ జరగనుంది.
మెగా టోర్నీ అనంతరం నవంబర్ 23 నుంచి డిసెంబర్ 5 వరకు భారత్- ఆస్ట్రేలియా మధ్య ఐదు టీ20ల సిరీస్ జరగనుంది. నవంబర్ 23న విశాఖ వేదికగా తొలి టీ20 జరగనుండగా.. నవంబర్ 26న త్రివేండ్రం వేదికగా రెండో టీ20, నవంబర్ 28న గౌహతి వేదికగా మూడో టీ20, డిసెంబర్ 1న నాగ్పూర్ వేదికగా నాలుగో టీ20 జరగనుంది.
చివరి టీ20 డిసెంబర్ 3న హైదరాబాద్ వేదికగా జరగనుంది. వన్డే ప్రపంచకప్లో ఆతిథ్య హక్కులు దక్కని మైదానాలకు ఓదార్పుగా భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్ మ్యాచ్లు కేటాయించారు. వచ్చే ఏడాది జనవరి 24 నుంచి ఇంగ్లండ్తో భారత్ ఐదు టెస్ట్ల సిరీస్ ఆడనుంది. జనవరి 24న హైదరాబాద్ వేదికగా తొలి టెస్ట్ జరగనుండగా.. ఫిబ్రవరి 6న వైజాగ్ వేదికగా రెండో టెస్ట్ జరగనుంది.