ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో విజేతగా నిలిచిన భారత జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) భారీ క్యాష్ ప్రైజ్ను ప్రకటించింది. రూ. 58 కోట్ల రూపాయాలను నగదు బహుమతిగా అందజేస్తామని తెలిపింది. ఈ మేరకు గురువారం సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ క్యాష్ ప్రైజ్ను జట్టులోని ఆటగాళ్లు, కోచ్లు, సపోర్ట్ స్టాఫ్తో పాటు సెలెక్షన్ కమిటీకి ఇస్తామని పేర్కొంది. వారి ప్రదర్శనకు సత్కారంగానే ఈ నజరానాను ప్రకటించినట్లు స్పష్టం చేసింది.
టీమిండియా గెలవగానే క్యాష్ ప్రైజ్ ప్రకటిస్తారని అంతా భావించినా.. బోర్డు 11 రోజుల సమయం తీసుకుంది. అయితే ఈ ప్రైజ్మనీలో ఎవరికి ఎంతా? అనే వివరాలను వెల్లడించలేదు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా అద్భుత ప్రదర్శన కనబర్చి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఓటమెరుగని జట్టుగా టీమిండియా టైటిల్ అందుకుంది. లీగ్ దశలో బంగ్లాదేశ్, పాకిస్థాన్, న్యూజిలాండ్ను మట్టికరిపించిన టీమిండియా.. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో న్యూజిలాండ్పై 4 వికెట్ల తేడాతో గెలిచి విశ్వ విజేతగా నిలిచింది.

టీమిండియాకు ఇది మూడో ఛాంపియన్స్ ట్రోఫీ కాగా.. వరుసగా రెండో ఐసీసీ టైటిల్. గతేడాది వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2024ను కూడా టీమిండియా కైవసం చేసుకుంది. ఆ సమయంలో భారత జట్టుకు బీసీసీఐ రూ. 125 కోట్ల భారీ నజరానాను ప్రకటించింది.
ఈ రూ. 125 కోట్లలో జట్టులోని ఆటగాళ్లతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్కు తలో రూ.5 కోట్లు ఇచ్చిన బీసీసీఐ.. సహాయక కోచ్లకు తలో రూ.2.5 కోట్లు, అలాగే ఇతర సహాయక సిబ్బందిగా ఉన్న తొమ్మిది మందికి తలో రూ. 2 కోట్లు ఇచ్చింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సభ్యులకు, రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికైన రింకూ సింగ్, శుభ్మన్ గిల్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్లకు తలా రూ.కోటి అందజేశారు. అయితే సపోర్ట్ స్టాఫ్తో సమంగా తనకు కూడా రూ. 2.5 కోట్లు ఇవ్వాలని రాహుల్ ద్రవిడ్ కోరినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజా రూ. 58 కోట్ల ప్రైజ్మనీలో ఎవరికి ఎంత ఇవ్వాలనే వివరాలను వెల్లడించలేదని అర్థమవుతోంది.