ఐసీసీ మహిళల వన్డే క్రికెట్ ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) భారీ నజరానా ప్రకటించింది. విశ్వ విజేతగా నిలిచిన హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల జట్టుకు రూ. 51 కోట్ల క్యాష్ ప్రైజ్ అందజేస్తామని బీసీసీఐ తమ ప్రకటనలో పేర్కొంది. ఆదివారం జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన భారత్ 52 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించిన సంగతి తెలిసిందే.
47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ హర్మన్ సేన్ తొలి ప్రపంచకప్ను ముద్దాడింది. గతంలో రెండు సార్లు ఫైనల్లో ఓటమి ఎదురైనా.. ఈ సారి ఏ తప్పిదం చేయకుండా భారత్ ప్రపంచకప్ను ఒడిసి పట్టుకుంది. ఈ విజయంతో యావత్ దేశం పులికించిపోతుంది. భారత మహిళలు సాధించిన ఈ చారిత్రాత్మక విజయంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలోనే బీసీసీఐ కూడా భారీ నజరానా ప్రకటించి వారి విజయాన్ని కొనియాడింది. ఈ విజయం మహిళల క్రికెట్ను మరో స్థాయికి తీసుకెళ్తుందని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

'బీసీసీఐ సెక్రటరీగా జైషా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత మహిళల క్రికెట్కు అధికా ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభమైంది. ఐసీసీ ఛైర్మన్గా మహిళల ప్రపంచకప్ ప్రైజ్మనీ విషయంలోనూ జైషా ప్రత్యేకంగా నిలిచారు. పురుషుల జట్టు కంటే ఎక్కువ ప్రైజ్మనీ అందించారు. ఇప్పుడు ఛాంపియన్గా నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ నుంచి రూ.51 కోట్ల నజరానా అందిస్తున్నాం. ఈ ప్రైజ్మనీని ఆటగాళ్లతో పాటు కోచ్, సహాయక సిబ్బందికి అందజేస్తాం.
1983లో కపిల్ దేవ్ నాయకత్వంలో టీమిండియా తొలిసారి ప్రపంచకప్ నెగ్గింది. అప్పటి నుంచి దేశంలో క్రికెట్కు విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఇప్పుడు అమ్మాయిలు కూడా అద్భుతం చేసి చూపించారు. భవిష్యత్తులో మరింతమంది మహిళలు క్రికెట్ను కెరీర్గా ఎంచుకునేందుకు ఇది పునాదిగా మారుతోంది.'అని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఈ ప్రకటనలో ప్రస్తావించారు. టోర్నీ విజేతగా భారత జట్టుకు రూ. 39 కోట్ల ప్రైజ్మనీ దక్కింది.