నాలుగు టీ20ల సిరీస్ కోసం సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను బీసీసీఐ శుక్రవారం వెల్లడించింది. భారత్-ఏ తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చిన రమణ్దీప్ సింగ్కు అవకాశం దక్కింది.
అతనితో పాటు కర్ణాటక బౌలర్ విజయ్కుమార్ వైశాఖ్ కూడా తొలిసారి టీమిండియా పిలుపును అందుకున్నాడు. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ, హార్దిక్ పాండ్యా తమ స్థానాలను నిలబెట్టుకోగా.. టెస్ట్ టీమ్ నుంచి తప్పించి అక్షర్ పటేల్ను టీ20 సిరీస్కు ఎంపిక చేశారు. వరుణ్ చక్రవర్తీ, రవి బిష్ణోయ్ స్పిన్నర్లు తమ స్థానాలను నిలబెట్టుకున్నాడు. ఆవేశ్ ఖాన్, యశ్ దయాల్ రీఎంట్రీ ఇచ్చారు.

నవంబర్ 8 నుంచి 15 వరకు ఈ సిరీస్ జరగనుంది. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ ఆడిన రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్లతో పాటు పేస్ ఆల్రౌండర్ శివమ్ దూబే గాయాలతో ఈ పర్యటనకు దూరమయ్యారని బీసీసీఐ తమ ప్రకటనలో స్పష్టం చేసింది. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్తోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన మయాంక్ యాదవ్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు.
మూడు మ్యాచ్ల్లో తన సెన్సేషనల్ పేస్తో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టాడు. కానీ అంతలోనే అతను మళ్లీ గాయపడ్డాడు. గాయపడిన ఆటగాళ్లంతా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్ తీసుకుంటారని బీసీసీఐ తమ ప్రకటనలో స్పష్టం చేసింది.
ఈ జట్టు ఎంపికను చూస్తుంటే సంజూ శాంసన్ను ఓపెనర్గా కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. బంగ్లాదేశ్తో హైదరాబాద్ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్లో సంజూ శాంసన్ విధ్వంసకర శతకంతో చెలరేగిన విషయం తెలిసిందే. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రమణ్దీప్ సింగ్ ఎమర్జింగ్ ఆసియాకప్లో సత్తా చాటారు. ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నారు. సౌతాఫ్రికా పర్యటనతో పాటు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే టెస్ట్ టీమ్ను కూడా బీసీసీఐ ప్రకటించింది. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి ఈ జట్టులో చోటు దక్కింది.
వెటరన్ పేసర్ మహమ్మద్ షమీని ఈ పర్యటనకు ఎంపిక చేస్తారని ప్రచారం జరిగినా.. సెలెక్టర్లు అతన్ని పక్కనపెట్టారు. సౌతాఫ్రికా టూర్కు కూడా ఎంపిక చేయలేదు. దాంతో షమీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తీ, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, విజయ్ కుమార్ వైశాఖ్, ఆవేశ్ ఖాన్, యశ్ దయాల్
ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా, యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, అశ్విన్, జడేజా, సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.