టీ20 ప్రపంచకప్ 2024లో విజేతగా నిలిచిన టీమిండియా గురువారం స్వదేశంలో అడుగుపెట్టనుంది. 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐసీసీ టైటిల్ గెలిచిన టీమిండియాకు ఘన స్వాగతం పలికేందుకు బీసీసీఐ భారీ ఏర్పాట్లు చేస్తోంది. గురువారం తెల్లవారు జామున 1.30 గంటలకు టీమిండియా న్యూఢిల్లీ చేరుకోనుంది.
ఉదయం 11 గంటలకు టీమిండియా ఆటగాళ్లతో దేశ ప్రధాని నరేంద్ర మోదీ బ్రేక్ ఫాస్ట్ చేయనున్నారు. అనంతరం ప్రపంచకప్ గెలిచి ఆటగాళ్లను ప్రభుత్వం తరఫున సత్కరించనున్నారు. ఇక ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుతో ముంబైలోని మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జై షా ట్వీట్ చేశాడు. సాయంత్రం 5 గంటలకు ఈ విజయోత్సవ సంబరాలు మొదలవుతాయని, అభిమానులు భారీ సంఖ్యలో హాజరు కావాలని జై షా కోరారు. ప్రపంచకప్ గెలిచిన జట్టుతో ఓపెన్ బస్ పరేడ్ నిర్వహించనున్నారు. ధోనీ సారథ్యంలోని టీమిండియా 2007 టీ20 ప్రపంచకప్ గెలిచినప్పుడు కూడా ఇలానే ముంబైలో భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు.
వేలాది మంది అభిమానులు టీమిండియా ఆటగాళ్లున్న బస్సు వెంట నడిచి గెలుపు సంబరాల్లో మునిగితేలారు. తాజాగా అప్పటి ఫొటోను జైషా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఇదే విధంగా విజయోత్సవ సంబరాల్లో అభిమానులు భాగం కావాలని పిలుపునిచ్చారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం విజయోత్సవ ర్యాలీకి పెద్ద సంఖ్యలో హాజరవ్వాలని అభిమానులను కోరాడు.
టీమిండియా 2011 వన్డే ప్రపంచకప్ గెలిచినప్పుడు ఎలాంటి జైత్రయాత్ర నిర్వహించలేదు. ప్రపంచకప్ ముగిసిన 5 రోజులకే ఐపీఎల్ ప్రారంభం కావడంతో ఎలాంటి సంబరాలు జరపలేదు.
సౌతాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించి ప్రపంచకప్ను ముద్దాడింది. వాస్తవానికి ప్రపంచకప్ ముగిసిన వెంటనే టీమిండియా స్వదేశానికి రావాల్సి ఉండగా.. బార్బోడస్లోని భారీ తుఫాను కారణంగా అక్కడే చిక్కుకుపోయింది. ఈ క్రమంలోనే బీసీసీఐ.. టీమిండియా ఆటగాళ్ల కోసం ప్రత్యేక విమానాన్ని పంపించింది. విజయోత్సవ ర్యాలీ ముగిసిన అనంతరం భారత ఆటగాళ్లు తమ ఇళ్లకు వెళ్లనున్నారు.