
డెహ్రాడూన్: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ను మెరుగైన చికిత్స కోసం ముంబైకి తరలించారు. జనవరి 30న ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన రిషభ్ పంత్ను డెహ్రాడూన్లోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన విషయం తెలిసిందే. అక్కడ పంత్ నుదుటికి సంబంధించి స్వల్ప ప్లాస్టిక్ సర్జరీ కూడా జరిగింది. అయితే ఇంకా మెరుగైన వైద్యం కోసం అతన్ని ముంబైకి తరలించారు. రిషభ్ పంత్ ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీ క్రికెట్ బోర్డు (డీడీసీఏ) డైరెక్టర్ శ్యామ్ శర్మ తాజాగా వివరాలను వెల్లడించారు.'మెరుగైన వైద్యం కోసం క్రికెటర్ పంత్ను ముంబైకి తరలించారు'' అని శర్మ తెలిపారు.
బీసీసీఐ వైద్య బృందం సమక్షంలో కుడికాలు లిగ్మెంట్కు శస్త్ర చికిత్స నిర్వహిస్తారు. మరోవైపు బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా పంత్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే విదేశాలకు (యూకే) తరలించే అంశంపైనా బీసీసీఐ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
ముఖ్యంగా మోకాలి ఎముకకు అయిన గాయం చాలా తీవ్రమైనదని, దాని నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు వైద్యులు. ఈ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి కనీసం ఆరు నెలల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని సమాచారం...
ఇదే నిజమైతే ఐపీఎల్ 2023 సీజన్తో పాటు వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్కి, ఆ తర్వాత జూన్- జూలై మాసాల్లో జరిగే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్కి దూరం అవుతాడు రిషబ్ పంత్. ఆరు నెలల తర్వాత గాయం నుంచి కోలుకుని, పూర్తిగా ఫిట్నెస్ సాధించడానికి సమయం తీసుకుంటే అక్టోబర్లో జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి కూడా రిషబ్ పంత్ అందుబాటులో ఉండడం అనుమానమే.
రిషభ్పంత్ త్వరగా కోలుకొని తిరిగి తన ఆట కొనసాగించాలని భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఆకాంక్షించాడు. ''పంత్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. వాటిని ఎదుర్కొని నువ్వు ముందుకు సాగాలి. త్వరగా కోలుకొని తిరిగి అతడి మార్గంలోకి రావాలని ప్రార్థిస్తున్నాను''అని గంగూలీ పేర్కొన్నాడు.