ముంబై: చైనా వస్తు బహిష్కరణ సెగతో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి వివో వైదొలగడంతో..ఈ సీజన్కు మరో టైటిల్ స్పాన్సర్ను వెతికి పట్టుకోవడం బీసీసీఐకి ప్రతిష్టాత్మకంగా మారింది. వివో ప్రతి ఏడాదీ రూ.440 కోట్లు చెల్లిస్తుండగా కరోనా నేపథ్యంలో కొత్త స్పాన్సర్ అంత మొత్తానికి టైటిల్ హక్కులు సొంతం చేసుకొనేందుకు ముందుకు రావడం కష్టమేనని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రాబోయే ఏడు రోజుల్లో ఐపీఎల్ స్పాన్సర్షిప్ కింద రూ.300 కోట్లు సంపాదించాలని బీసీసీఐ టార్గెట్గా పెట్టుకుంది. ఇందు కోసం బోర్టు కొత్త ప్లాన్ను సిద్దం చేసింది. అధికారిక స్పాన్సర్లను మూడు నుంచి ఐదుకి పెంచడం ద్వారా సాధ్యమైనంత ఎక్కువ మొత్తం రాబట్టాలని బోర్డు భావిస్తోంది. కొత్తగా వచ్చే ఒక్కో స్పాన్సర్ నుంచి కనీసం రూ. 40 కోట్ల చొప్పున రాబట్టాలని బీసీసీఐ వ్యూహాలు రచిస్తుంది.
ఈ-లెర్నింగ్ యాప్ 'అన్ అకాడమీ', క్రెడిట్ కార్డుల చెల్లింపుల సంస్థ 'క్రెడ్' కొత్తగా రానున్న రెండు సంస్థలుగా తెలుస్తోంది. 'అన్ అకాడమీ' ఇప్పటికే టైటిల్ బిడ్ డాక్యుమెంట్లు సేకరించిందని బోర్డు వర్గాలు వెల్లడించాయి. తద్వారా దేశంలో క్రికెట్ క్రేజ్ ఏపాటిదో నిరూపించాలని బీసీసీఐ పట్టుదలగా ఉన్నట్టు సమాచారం. ఇక..అమెజాన్, బైజూస్, డ్రీమ్ లెవెన్ టైటిల్ స్పాన్సర్షిప్ రేసులో ఉండగా.. అనూహ్యంగా కొత్త సంస్థ తెరపైకి వచ్చే అవకాశాలున్నట్టు బోర్డు వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు..ఈ వారం చివరికల్లా టైటిల్ స్పాన్సర్ విషయాన్ని తేల్చేయనుందని పేర్కొన్నాయి.
వాస్తవానికి గత ఐపీఎల్ ద్వారా బీసీసీఐ రూ.618 కోట్లు సంపాదించింది. టైటిల్ స్పాన్సర్ వివో రూ. 440 కోట్లు ఇవ్వగా.. అధికారిక పార్ట్నర్స్ అయిన టాటా మోటార్స్, ఎఫ్బీబీ, డ్రీమ్ ఎలెవన్ రూ.120 కోట్లు చెల్లించాయి. అంపైర్ స్పాన్సర్ అయిన పేటీఎమ్ రూ.28 కోట్లు, స్ట్రాటజిక్ టైమ్ అవుట్ పార్ట్నర్ అయిన సీయెట్ రూ.30 కోట్లు ఇచ్చాయి. అయితే బీసీసీఐ టార్గెట్గా పెట్టుకున్న 300 కోట్లు వచ్చినా.. మరో 140 కోట్లు నష్టపోనుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రూ.300 కోట్లు రెవెన్యూ వచ్చినా బోర్డు గట్టెక్కినట్లే.