
కోల్కతా: టీమిండియా మాజీ కెప్టెన్, భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరోసారి బ్యాట్ పట్టాడు. బౌండరీలు బాదుతూ దుమ్మురేపాడు. తన ట్రేడ్ మార్క్ ఆఫ్ సైడ్ డ్రైవ్స్తో ఫోర్లు, క్రీజు ముందుకొచ్చి సిక్సర్లు బాదాడు. శుక్రవారం ఈడెన్ గార్డెన్స్లో జరిగిన బీసీసీఐ ఏజీఎమ్ ఫెస్టివల్ మ్యాచ్లో భాగంగా దాదా బ్యాట్ పట్టి పాత గంగూలీని గుర్తు చేశాడు.
ఇక గంగూలీ బ్యాట్తో రాణించినా అతని సారథ్యంలోని బీసీసీఐ ప్రెసిడెంట్స్ ఎలెవన్ ఒక్క రన్ తేడాతో జైషా కెప్టెన్సీలోని సెక్రటరీ ఎలెవన్ చేతిలో ఓడిపోయింది. బీసీసీఐ ఏజీఎంకు ముందు జరిగిన ఈ 15 ఓవర్ల ఫ్రెండ్లీ మ్యాచ్లో తొలుత సెక్రటరీ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 128 రన్స్ చేసింది. ఆ జట్టులో అరుణ్ ధూమల్(36), జయదేవ్ షా(40) 92 పరుగుల భాగస్వామ్యంతో రాణించారు. లక్ష్యచేధనలో ఆరో నంబర్లో ఫినిషర్గా వచ్చిన గంగూలీ 20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 రన్స్ చేశాడు. కానీ, మ్యాచ్ రూల్స్ ప్రకారం తన రిటైరవగా.. తర్వాత ప్రెసిడెంట్స్ టీమ్ తడబడి 127/5 స్కోర్ వద్దే ఆగి ఓడిపోయింది.
గంగూలీకి బదులు బ్యాటింగ్కు వచ్చిన అజారుద్దీన్ను జై షా ఎల్బీగా ఔట్ చేయడంతో సెక్రటరీ టీమ్ విజయం లాంఛనమైంది. సెక్రటరీ టీమ్ కెప్టెన్ జైషా(3/58) తన స్పెల్లో అజారుద్దీన్(2)సహా ముగ్గురిని ఔట్ చేసి తన జట్టును గెలిపించాడు. అంతకుముందు అజారుద్దీన్తో కలిసి కొత్త బంతితో బౌలింగ్ చేసిన గంగూలీ ఓ వికెట్ కూడా పడగొట్టాడు.
సంక్షిప్త స్కోర్లు:
బీసీసీఐ సెక్రటరీ ఎలెవన్: 15 ఓవర్లలో 128/3( జయదేవ్ షా 40 రిటైర్డ్, అరుణ్ ధూమల్ 36, జై షా 10 నాటౌట్; సౌరవ్ గంగూలీ 1/19)
బీసీసీఐ ప్రెసిడెంట్స్ ఎలెవన్: 15 ఓవర్లో 127/5( సౌరవ్ గంగూలీ 35 రిటైర్డ్, మహమ్మద్ అజారుద్దీన్ 2, అవిషేక్ దాల్మియా 13, జై షా 3/58)