న్యూఢిల్లీ: ఫిక్సర్లు మాట కలిపేందుకు ప్రయత్నిస్తే భారత ఆటగాళ్లు వెంటనే భారత క్రికెట్ నియంత్ర మండలి (బీసీసీఐ)కి సమాచారమిస్తారని యాంటి కరప్షన్ యూనిట్ (ఏసీయూ) చీఫ్ అజిత్ సింగ్ అన్నారు. కరోనా వైరస్ కారణంగా క్రికెట్ టోర్నీలన్నీ రద్దవ్వడం.. దేశాలన్నీలాక్డౌన్ విధించడంతో ఇళ్లకే పరిమితమైన ఆటగాళ్లు.. సోషల్ మీడియాలో ఎక్కువగా కాలక్షేపం చేస్తున్నారు.
అయితే ఇదే అదునుగా ఫిక్సర్లు ఆటగాళ్లతో సంప్రదింపులు జరిపే అవకాశాలున్నాయని, క్రికెటర్లు జాగ్రత్తగా ఉండాలని ఐసీసీ హెచ్చరించింది. అయితే భారత ఆటగాళ్ల పట్ల తమకు ఎలాంటి భయంలేదని.. అలాంటిది ఏదైనా జరిగితే వెంటనే అవినీతి నిరోధక విభాగానికి తెలియజేస్తారని అజయ్ సింగ్ తెలిపారు.
'బూకీల సంప్రదింపులు ఎలా మొదలవుతాయో మా ఆటగాళ్లకు ముందే వివరించిపెట్టాం. అభిమానులెవరో, ఫిక్సర్లెవరో మావాళ్లు ఇట్టే పసిగట్టగలరు. ఒకవేళ ఏదైనా తేడాగా అనిపించింది అంటే వెంటనే సమాచారం అందిస్తారు. దాన్ని బట్టి మేము ముందుకు సాగుతాం. మా టీమ్ కూడా సోషల్ మీడియాలో ఆటగాళ్ల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటుంది. కాకపోతే ప్రస్తుత లాక్డౌన్ నేపథ్యంలో లోకేషన్ వెరిఫికేషన్ అనేది అవసరం లేదు.
అయితే మా దృష్టికి వస్తే మాత్రం లాక్డౌన్ ముగిసిన వెంటనే విచారణ జరుపతాం. ఆటగాళ్లు, మేం వేరు కాదు. వారికి మేం విరోదులం కాదు. కేవలం ఆటను భ్రష్టుపట్టించే వారిపై మాత్రమే మా నిఘా ఉంటుంది. భారత క్రికెటర్లంతా నిజాయితీ పరులు. వారికి వారి బాధ్యతలు తెలుసు'అని రాజస్థాన్ మాజీ డీజీపీ అయిన అజిత్ సింగ్ పేర్కొన్నారు.
ఇక అంతకు ముందు క్రికెటర్లను హెచ్చరిస్తూ ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్ చీఫ్ అలెక్స్ మార్షల్ ఓ ప్రకటన విడుదల చేశారు. 'కరోనా వైరస్తో క్రీడా ఈవెంట్లు తాత్కాలికంగా నిలిచిపోయాయి. లాక్డౌన్ కారణంగా అటు అంతర్జాతీయ మ్యాచ్లు, ఇటు దేశవాళీ మ్యాచ్లు వాయిదా పడ్డాయి. ఈ సమయాన్ని ఫిక్సర్లు క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. ఇటువంటి సందర్భాల్లో వారు చాలా యాక్టివ్గా ఉంటారు.
ఫిక్సింగ్లో బాగా పేరుగాంచిన కొంతమంది ప్రస్తుత సమయాన్ని వినియోగించుకుంటారు. మన క్రికెటర్లు ఎవరైతే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉంటారో వారితో టచ్లోకి వస్తారు.. మాటా-మంతీ కలిపి వల వేస్తారు. మీతో పరిచయాల్ని పెంచుకోవడానికి యత్నిస్తారు. ఆపై ఫిక్సింగ్కు చేయడానికి ప్రేరేపిస్తారు. ఇప్పటికే ఈ విషయాన్ని అన్ని క్రికెట్ బోర్డులకు చెరవేసి అప్రమత్తంగా ఉండాలని కోరాం' అని అలెక్స్ మార్షల్ పేర్కొన్నారు.