భారత్తో నాలుగో టెస్ట్లో ఇంగ్లండ్ అద్భుతంగా పుంజుకుంది. రెండో రోజు ఆటలో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ముందుగా బౌలింగ్తో టీమిండియాను త్వరగానే ఆలౌట్ చేసిన ఇంగ్లండ్.. తర్వాత బజ్ బాల్ బ్యాటింగ్తో దుమ్మురేపింది. దాంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 46 ఓవర్లలో 2 వికెట్లకు 225 పరుగులు చేసింది. ఓపెనర్లు బెన్ డకెట్(100 బంతుల్లో 13 ఫోర్లతో 94), జాక్ క్రాలీ (113 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్తో 84) తృటిలో శతకాలు చేజార్చుకున్నారు. క్రీజులో ఓలిపోప్(16 బ్యాటింగ్)తో పాటు జోరూట్(0 బ్యాటింగ్) ఉన్నారు. భారత బౌలర్లలో అరంగేట్ర పేసర్ అన్షూల్ కంబోజ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీసారు.
అంతకుముందు 264/4 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా 114.1 ఓవర్లలో 358 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్(75 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 54), యశస్వి జైస్వాల్(107 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 58), సాయి సుదర్శన్(151 బంతుల్లో 7 ఫోర్లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ ఐదు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు పడగొట్టాడు. క్రిస్ వోక్స్, లియామ్ డాసన్ చెరో వికెట్ తీసారు. ఇంగ్లండ్ ఇంకా 133 పరుగుల వెనుకంజలో ఉంది. మూడో రోజు తొలి సెషన్ ఆట మ్యాచ్ గమనాన్ని నిర్దేశించనుంది.

రెండో రోజు ఆట ఆరంభంలోనే టీమిండియాకు ఆదిలో గట్టి షాక్ తగిలింది. ఓవర్నైట్ బ్యాటర్ రవీంద్ర జడేజా(20) ఒకే ఒక్క పరుగు చేసి ఆర్చర్ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్తో కలిసి శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్ కొనసాగించాడు. ఈ ఇద్దరూ ఆచితూచి ఆడారు. 6వ వికెట్కు 48 పరుగులు జోడించిన అనంతరం శార్దూల్ ఠాకూర్(41)ను స్టోక్స్ పెవిలియన్ చేర్చాడు. దాంతో రిషభ్ పంత్ బ్యాటింగ్కు రావాల్సి వచ్చింది. మరో వికెట్ పడకుండా పంత్, సుందర్ జాగ్రత్తగా ఆడి తొలి సెషన్ను ముగించారు. దాంతో భారత్ 321/6 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది.
రెండో సెషన్లోనూ పంత్, సుందర్ ఆచితూచి ఆడే ప్రయత్నం చేశారు. అయితే ఈ జోడీని బెన్ స్టోక్స్ విడదీసాడు. వాషింగ్టన్ సుందర్(27)ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే అరంగేట్ర పేసర్ అన్షుల్ కంబోజ్(0)ను కీపర్ క్యాచ్గా వెనక్కి పంపాడు. దాంతో భారత్ ఒకే ఓవర్లో వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. రిషభ్ పంత్ మాత్రం ఆర్చర్ బౌలింగ్లో ఒంటి కాలితోనే భారీ సిక్సర్ బాదాడు. అనంతరం స్టోక్స్ బౌలింగ్లో బౌండరీ బాదిన పంత్.. 70 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జోఫ్రా ఆర్చర్ తన మరుసటి ఓవర్లోనే రిషభ్ పంత్ను స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆఖరి వికెట్గా బుమ్రా(4)ను ఆర్చర్ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చి భారత తొలి ఇన్నింగ్స్కు తెరదించాడు.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలీ దూకుడుగా ఆరంభించారు. తొలి ఓవర్ నుంచే భారత బౌలర్లపైకి ఎదురుదాడికి దిగారు. బజ్బాల్ బ్యాటింగ్తో ఓవర్కు 6 పరుగులు రాబట్టారు. దాంతో ఇంగ్లండ్ 14 ఓవర్లలోనే 77/0 స్కోర్తో టీ బ్రేక్కు వెళ్లింది. ఆఖరి సెషన్లోనూ ఇదే దూకుడును కనబర్చిన ఈ జోడీ పోటాపడి బౌండరీలు బాదింది. వన్డే తరహా బ్యాటింగ్తో భారత బౌలర్లను చెడుగుడు ఆడింది. ఈ క్రమంలో బెన్ డకెట్ 46 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. జాక్ క్రాలీ 73 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. అనంతరం మరింత దూకుడుగా ఆడిన ఈ జోడీ.. 28.4 ఓవర్లలోనే 150 పరుగుల మార్క్ అందుకుంది.
ప్రమాదకరంగా మారిన ఈ జోడీని రవీంద్ర జడేజా విడదీసాడు. జాక్ క్రాలీ(84)ని క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 166 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం సెంచరీ దిశగా సాగిన బెన్ డకెట్ను అరంగేట్ర పేసర్ అన్షుల్ కంబోజ్ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో ఓలీ పోప్, జోరూట్ ఆచితూచి ఆడి మరో వికెట్ పడకుండా రెండో రోజు ఆటను ముగించారు. భారత బౌలర్లలో బుమ్రా, అన్షుల్ కంబోజ్ మినహా.. మిగతా బౌలర్లు ధారళంగా పరుగులిచ్చుకున్నారు.