ఇంగ్లండ్తో యాషెస్ సిరీస్లో భాగంగా ఆఖరి టెస్ట్కు ముందు ఆస్ట్రేలియా బ్యాటర్లకు టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప కీలక సలహా ఇచ్చాడు. దూకుడును పక్కనబెట్టి అసలు సిసలు టెస్ట్ క్రికెట్ ఆడాలని సూచించాడు. భారత టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాటర్లు అయిన చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానేలా బ్యాటింగ్ను అనుకరించాలని సలహా ఇచ్చాడు.
ఈ ఐదు టెస్ట్ల యాషెస్ సిరీస్ను ఆస్ట్రేలియా ఇప్పటికే 3-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మెల్బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్లో ఆసీస్ గెలిచే మ్యాచ్లో ఓటమిపాలైంది. బౌలింగ్కు అనుకూలంగా ఉన్న వికెట్పై దూకుడుగా ఆడబోయి రెండు ఇన్నింగ్స్ల్లో 152, 132 పరుగులకు ఆలౌటై మూల్యం చెల్లించుకుంది. ఈ సిరీస్లో చివరి మ్యాచ్ సిడ్నీ వేదికగా జనవరి 4 నుంచి ప్రారంభం కానుంది.
ఈ మ్యాచ్ నేపథ్యంలో తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన ఊతప్ప.. అజింక్యా రహానే, పుజారాలా ఓపికగా.. జిడ్డుగా బ్యాటింగ్ చేయాలని సూచించాడు. ఆస్ట్రేలియా గడ్డపై 2018-19, 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలను భారత్ గెలవడంలో ఈ ఇద్దరే కీలక పాత్ర పోషించారని గుర్తు చేశాడు.
'ఇది ఒక ద్వంద స్థితి. మెల్బోర్న్ పిచ్ ఆడటానికి అసాధ్యమైన వికెట్ కాదు. గతంలో కూడా ఇక్కడ ఫాస్ట్ బౌలర్లకు సహకరించే పిచ్లను తయారు చేశారు. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న విధానం వల్లే ఇలా జరుగుతుందని నేను భావిస్తున్నా. ఈ పిచ్లు క్రీడా స్ఫూర్తికి విరుద్దంగా ఉన్నాయని నాకు అనిపిస్తుంది. కానీ మీ దగ్గర సరైన టెక్నిక్, సరైన ఆలోచనా విధనం, పోరాడే పట్టుదల ఉంటే.. ఈ తరహా వికెట్లపై కూడా రాణించగలరు.

అయితే ఈ వికెట్పై భారీ స్కోర్లు చేయలేరు. 300 ప్లస్ పరుగులు రాబట్టడం అసాధ్యం. కానీ ఈ పిచ్పై 250 పరుగులు చేయవచ్చు. అలా జరగాలంటే కాస్త ఓపికగా ఆడాలి. క్రీజులో ఎక్కువసేపు నిలబడాలి. పుజారా, అంజింక్యా రహానే ఆడినట్లుగా జిడ్డుగా బ్యాటింగ్ చేయాలి. అప్పుడు కచ్చితంగా పరుగులు చేయగలరు. ప్రస్తుతం మనం టెస్ట్ క్రికెట్ ఆడుతున్న తీరు పూర్తిగా మారిపోయింది కాబట్టి సందేహంతోనే ఈ విషయాలను చెబుతున్నా.
యాషెస్ సిరీస్లో టెస్ట్ మ్యాచ్లు రెండు రోజుల్లోనే ముగిసిపోవడం నాకు నచ్చడం లేదు. వినోదం కోసం టెస్ట్ క్రికెట్ను నాశనం చేస్తున్నామా? అనే బాధ కలుగుతోంది. మెల్బోర్న్ టెస్ట్లో జో రూట్ కూడా తడబడ్డాడు. రెండో ఇన్నింగ్స్లో దూకుడుగా ఆడాలా? లేక తన సహజ శైలిలో ఆడాలా? అనే క్లారిటీ అతనికి లేదు. అది చాలా దురదృష్టకరం. వారి పరిస్థితిని చూస్తుంటే నాకు బాధగా ఉంది.'అని బజ్బాల్ శైలిని రాబిన్ ఊతప్ప తప్పుబట్టాడు.