కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కంటే టీమిండియా చాలా బలహీనంగా ఉందని ఆ జట్టు మాజీ క్రికెటర్ బసిత్ అలీ అన్నాడు. టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోందని, ఆ జట్టు పూర్తిగా టాప్-3 బ్యాటర్లపైనే ఆధారపడి ఉందని అభిప్రాయపడ్డాడు. ఈ ముగ్గురిని త్వరగా ఔట్ చేస్తే ఆసియాకప్, వన్డే ప్రపంచకప్లో టీమిండియాను ఓడించడం పాకిస్థాన్కు పెద్ద కష్టమేమి కాదని బసిత్ అలీ చెప్పుకొచ్చాడు.
ఈ నెల ఆగస్టు 30 నుంచి ఆసియాకప్ 2023 టోర్నీ ప్రారంభం కానుండగా.. సెప్టెంబర్ 2న భారత్-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ నేపథ్యంలో తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఇరు జట్ల బలాలు, బలహీనతలను చర్చించిన బసిత్ అలీ.. టీమిండియా కంటే పాకిస్థాన్ బలంగా ఉందని చెప్పాడు.

'బాబర్ ఆజామ్, ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, మహమ్మద్ రిజ్వాన్లతో పాకిస్థాన్ టాపార్డర్ బలంగా ఉంది. ఇఫ్తికర్, సల్మాన్ అలీ, షాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్లతో మిడిలార్డర్తో పాటు లోయరార్డర్ కూడా పటిష్టంగా కనిపిస్తోంది. అదే భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్ను పరిశీలిస్తే మిడిలార్డర్ చాలా బలహీనంగా ఉంది.
ఇషాన్ కిషన్ నెంబర్ 5లో ఆడితే.. అతను ఎలా రాణిస్తాడనేది ఎవరికి తెలియదు. టీమిండియా.. తిలక్ వర్మను కూడా ఆడించే అవకాశం ఉంది. అతన్ని మూడో స్థానంలో ఆడించి కోహ్లీని నాలుగో స్థానంలో బరిలోకి దించవచ్చు. భారత్కు నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఆడగలిగే అనుభవమైన బ్యాటర్లు లేరు.
ఆ జట్టు పూర్తిగా టాప్-3 బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్పైనే ఆధారపడి ఉంది. ఈ ముగ్గురు చెలరేగితే మాత్రం ప్రపంచకప్, ఆసియాకప్లో భారత్కు తిరుగు ఉండదు. విఫలమైతే మాత్రం టీమిండియాను ఈజీగా ఓడించవచ్చు.'అని బసిత్ అలీ అభిప్రాయపడ్డాడు.
ఆసియాకప్ బరిలోకి దిగే టీమిండియా కాంబినేషన్పై సస్పెన్స్ కొనసాగుతోంది. గాయంతో జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ల రీఎంట్రీపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే సోమవారం జరిగే సెలెక్షన్ కమిటీలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పాల్గొననున్నారు.
మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో జట్టును ప్రకటిస్తారని జాతీయ మీడియా పేర్కొంది. 17 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేస్తారని, రాహుల్, శ్రేయస్ అయ్యర్లకు చోటు దక్కుతుందని ప్రచారం జరుగుతోంది.