భారత్ X పాకిస్థాన్ మధ్య జరిగే పోరు ముందు ఏ సిరీస్, మ్యాచ్ పనికిరాదని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ అన్నాడు. క్రికెట్ సహా మరే ఇతర క్రీడలైనా భారత్X పాక్ మ్యాచ్లు సూపర్ సక్సెస్ అవుతాయని అభిప్రాయపడ్డాడు. హాకీ, కబడ్డీ, జావెలిన్ త్రో ఏ ఆటలోనైనా దాయాదుల పోరుకు సూపర్ క్రేజ్ ఉంటుందన్నాడు.
పారిస్ ఒలింపిక్స్లో జావెలిన్ త్రో ఈవెంట్లో స్వర్ణం, రజతం సాధించిన అర్షద్ నదీమ్, నీరజ్ చోప్రాల మధ్య ఓ సిరీస్ పెట్టినా.. ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పాడు. భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మళ్లీ ద్వైపాక్షిక సిరీస్ జరగాలని ఆకాంక్షించాడు. తాజాగా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. భారత్-పాక్ సిరీస్లకు ఉండే క్రేజ్.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి కూడా ఉండదన్నాడు.

'పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత బళ్లెం వీరుడు నీరజ్ చోప్రాపై అర్షద్ నదీమ్ పైచేయి సాధించాడు. లేకపోతే భారత్ స్వర్ణం గెలిచేది. అయితే దాయాది దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరిగితే బాగుంటుంది. అయితే, భారత క్రికెట్ జట్టును పంపించేది లేదని ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసింది. క్రికెట్ సిరీస్ల నిర్వహణ కష్టమే.
అందుకే హాకీ, కబడ్డీ, జావెలిన్ త్రో సిరీస్లను నిర్వహించాలి. భారత్, పాక్ మాత్రమే కాకుండా ఇతర దేశాలతో కలిసి ఈ సిరీస్లు ఏర్పాటు చేస్తే ఆదరణ భారీగానే ఉంటుంది. ఒకవేళ నదీమ్ నీరజ్ల మధ్య జావెలిన్ త్రో సిరీస్లో తలపడితే.. యావత్ ప్రపంచం టీవీలకు అతక్కుపోతుంది. స్టేడియాలు కూడా నిండిపోతాయి.

ఈ క్రేజ్ ముందు భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కూడా సరిపోదు. భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ల గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. వాటి ముందు యాషెస్ కూడా తక్కువే. ఇప్పుడు భారత్-ఆస్ట్రేలియా సిరీస్ హైప్ కోసం మాజీ క్రికెటర్లు కామెంట్స్ చేస్తున్నారు.'అని బసిత్ అలీ చెప్పుకొచ్చాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ గెలుస్తుందని రవి శాస్త్రి, ఆస్ట్రేలియా విజయం సాధిస్తుందని రికీ పాంటింగ్ జోస్యం చెప్పిన విషయం తెలిసిందే. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ సిరీస్ కోసం రోహిత్ సేన నవంబర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది.