టీమిండియా పేస్ విభాగంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ప్రశంసల జల్లు కురిపించాడు. భారత పేస్ విభాగం చాలా బలంగా ఉందని కొనియాడాడు. ఒకప్పుడు తమ జట్టులో స్టార్ పేసర్లు ఉండేవారని, ఇప్పుడు టీమిండియాలోకి ఆ స్థాయి బౌలర్లు వచ్చారని తెలిపాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న భారత జట్టుకు బసిత్ అలీ ఓ కీలక సూచన చేశాడు.
యువ పేసర్ మయాంక్ యాదవ్ను ఈ సిరీస్కు సిద్దం చేయాలని భారత సెలెక్టర్లకు సూచించాడు. తన పేస్తో మయాంక్ యాదవ్ ఆసీస్ ఆటగాళ్లను ఇబ్బంది పెడుతాడని పేర్కొన్నాడు.

'బంగ్లాదేశ్తో భారత పేసర్లు ఆడిన తీరును చూస్తుంటే రెండు కళ్లు చాలడం లేదు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు. మరొక సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ లేకుండానే టీమిండియా బరిలోకి దిగింది. భారత పేసర్లను చూస్తుంటే ఒకప్పుడు మా జట్టులోని షోయబ్ అక్తర్, వకార్ యూనిస్, వసీమ్ అక్రమ్ గుర్తుకొస్తున్నారు.
ప్రస్తుత భారత పేసర్లకు తోడుగా యువ బౌలర్ మయాంక్ యాదవ్ కూడా చేరితే తిరుగుండదు. అతని పేస్కు బౌన్స్ తోడైతే ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలే. ఆసీస్ గడ్డపై బౌన్స్ పక్కాగా ఉంటుంది. కాబట్టి ఆసీస్తో ఐదు టెస్ట్ల సిరీస్కు అతన్ని ఎంపిక చేయాలని చెబుతున్నా. అందుకోసం భారత సెలెక్టర్లు మయాంక్ యాదవ్ను సిద్దం చేయాలి.'అని బసిత్ అలీ సూచించాడు.
ఐపీఎల్ 2024 సీజన్లో సంచలన బౌలింగ్తో అందరి దృష్టిని ఆకర్షించిన మయాంక్ యాదవ్.. గాయంతో జట్టుకు దూరమయ్యాడు. అతను ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. బంగ్లాదేశ్తో తొలి టెస్ట్లో విరాట్ కోహ్లీ విఫలమైనా ఆందోళన పడాల్సిన అవసరం లేదని బసిత్ అలీ అన్నాడు. చిన్న జట్లపై స్టార్ క్రికెటర్ల ఏకాగ్రతతో ఆడలేరని, ఆసీస్తో టెస్ట్ సిరీస్లో కోహ్లీ సత్తా చాటుతాడని చెప్పాడు.
'విరాట్ కోహ్లీ మళ్లీ ఫామ్లోకి వస్తాడు. ఆస్ట్రేలియాతో అద్భుత ఇన్నింగ్స్లను చూస్తాం. అతనికి పేస్ వికెట్లు అంటే చాలా ఇష్టం. ఒక్కోసారి పెద్ద క్రికెటర్లు బలహీన జట్లపై ఏకాగ్రతను కోల్పోతారు. అదేం సమస్య కాదు. వారికి కఠినమైన ప్రత్యర్థులు ఎదురైతే నాణ్యమైన ఆటతీరు బయటకు వస్తోంది. ఈసారి కూడా బోర్డర్-గావస్కర్ ట్రోఫీని గెలవకుండా ఆసీస్ను భారత్ అడ్డుకుంటుందని భావిస్తున్నా. స్వదేశంలోనే కాదు.. విదేశీ గడ్డపైనా భారత్ అపూర్వ విజయాలను నమోదు చేసింది.'అని బసిత్ అలీ చెప్పుకొచ్చాడు.