
కరాచీ: ఫిక్సింగ్కు పాల్పడినట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) మాజీ సీఈఓ అరిఫ్ అబ్బాస్ చేసిన ఆరోపణలను ఆ దేశ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఖండించాడు. తాను ఫిక్సింగ్ చేసినట్లు ఏ ఒక్కరు నిరూపించినా బహిరంగంగా ఉరేసుకుంటానన్నాడు.
25 ఏళ్ల క్రితం 1994 శ్రీలంక పర్యటనలో బసిత్ అలీ మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడని, అంతేకాకుండా తన తప్పును అప్పటి టీమ్ మేనేజర్ ఇంతిఖబ్ అలామ్ ముందుట ఒప్పుకున్నాడని ఇటీవల అరిఫ్ అబ్బాసి తెలిపాడు. తాను చేసిన తప్పుకు క్షమించాలని బసిత్ అలీ ఇంతి ఖబ్ను వేడుకున్నాడని పేర్కొన్నాడు. ఈ విషయం ఇంతి ఖబే తనకు చెప్పాడని కూడా వ్యాఖ్యానించాడు.
అయితే ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ.. బసిత్ అలీ ఓ వీడియోను విడుదల చేశాడు. అప్పటి జట్టు మేనేజర్ అయిన ఇంతిఖబ్ తనకు ఫోన్ చేశాడని, ఈ ఫిక్సింగ్ వివాదంలో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, తాను చెప్పినట్లు మీడియాలో వచ్చేదానితో ఎలాంటి సంబంధం లేదని చెప్పారని బసిత్ తెలిపాడు. అంతేకాకుండా అరిఫ్ అబ్బాసికి ఓ సవాల్ విసిరాడు. తనపై వచ్చి ఫిక్సింగ్ ఆరోపణలను ప్రపంచంలోని ఏ కోర్టులో నిరూపించినా.. ఉరేసుకొని చస్తానన్నాడు.
'ఇంతిఖబ్ అలామ్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. మీడియాలో వచ్చేదానితో అతనికెలాంటి సంబంధం లేదన్నాడు. అయితే అరిఫ్ అబ్బాసి కానీ, లేక మరేవరైనా కానీ నాపై చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను ప్రపంచంలోని ఏ కోర్టులోనైనా నిరూపించండి. అలా చేస్తే ఉరేసుకొని చస్తా.'అని బసిత్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇక 1994 శ్రీలంక పర్యటనలో పాక్ మూడు టెస్ట్ల సిరీస్ను 2-0తో, వన్డే సిరీస్ను 4-1తో గెలుచుకుంది. 1990లో పాకిస్థాన్ జట్టులో కీలక ప్లేయర్ అయిన బసిత్..1993లో వెస్టిండీస్పై 67 బంతుల్లో సెంచరీ చేసి వన్డేల్లో రెండో వేగవంతమైన శతకం సాధించాడు. ఇక పాక్ తరఫున 19 టెస్టులు, 50 వన్డేలు ఆడిన బసిత్ అలీ మొత్తం 2000 పరుగులు చేశాడు.