ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్య హక్కులు అందుకున్న నేపథ్యంలో పాకిస్థాన్ చేపట్టే భద్రతా చర్యలు పటిష్టంగా ఉండాలని ఆ దేశ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ అన్నాడు. సొంతగడ్డపై బంగ్లాదేశ్, ఇంగ్లండ్, వెస్టిండీస్తో జరిగే అప్కమింగ్ సిరీస్ల్లో భద్రతా విషయంలో ఏ మాత్రం లోపాలున్నా.. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ చేజారుతుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)ని హెచ్చరించాడు.
అదే జరిగితే పీసీబీ కోట్ల రూపాయాలు నష్టపోవాల్సి ఉంటుందన్నాడు. ఇప్పటికే ఈ టోర్నీ నిర్వహణ కోసం పీసీబీ కోట్లు రూపాయాలు వెచ్చించి స్టేడియాలను పునరుద్ధరిస్తోంది. తాజాగా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన బాసిత్ అలీ.. భద్రతా విషయంలో లోపాలు లేకుండా చూసుకోవాలని పీసీబీకి సూచించాడు.

1996లో శ్రీలంక, భారత్తో కలిసి వన్డే ప్రపంచకప్కు ఆతిథ్యమిచ్చిన తర్వాత పాకిస్థాన్కు ఛాంపియన్స్ ట్రోఫీ రూపంలో పెద్ద అవకాశం లభించిందన్నాడు. పాకిస్థాన్లో మెగా టోర్నీ ఖాయం కాగానే.. ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు కూడా ఇక్కడికి వచ్చేందుకు సిద్దమయ్యాయని తెలిపాడు. ఈ నేపథ్యంలో భద్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నాడు.
'ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు పాకిస్థాన్ గడ్డపై జరిగే సిరీస్ల సందర్భంగా ఏదైనా అవాంచనీయ ఘటనలు చోటుచేసుకొంటే.. ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను కోల్పోయే ప్రమాదం ఏర్పడుతోంది. బలూచిస్థాన్, పెషావర్ల్లో మన సైనికులు మరణిస్తున్నారు. అక్కడ ఇలా ఎందుకు జరుగుతుందో పాకిస్థాన్ ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.
విదేశీ జట్లకు రక్షణ విషయంలో ఎటువంటి లోపం జరగకూడదు. మన ప్రధాని, రాష్ట్రపతి స్థాయిలో వారికి భద్రత ఉండాలి.'అని బాసిత్ అలీ సూచించాడు. గతంలో కూడా పాకిస్థాన్లో విదేశీ జట్లు పర్యటిస్తున్న సమయంలో పలు ఆందోళనకర ఘటనలు చోటు చేసుకున్నాయి. శ్రీలంక క్రికెటర్ల బస్సుపై ఉగ్రదాడి జరిగింది.
ఈ ఘటనలో శ్రీలంక క్రికెటర్లు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు పాకిస్థాన్లో ఏ జట్టు పర్యటించలేదు. 2021లోనూ భద్రతా కారణాలు చూపుతూ న్యూజిలాండ్ జట్టు అర్థంతరంగా వైదొలగింది. ఆ తర్వాత ఇంగ్లండ్ జట్టు కూడా తమ పర్యటనను రద్దు చేసుకుంది. తాజాగా భారత్ కూడా పాకిస్థాన్లో తమకు భద్రత ఉండదంటూ అక్కడికి వెళ్లేందుకు విముఖత వ్యక్తం చేస్తోంది. హైబ్రీడ్ మోడల్లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాలని పట్టుబడుతోంది.