బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్ జహనారా ఆలమ్ సంచలన ఆరోపణలు చేసింది. బంగ్లాదేశ్ మాజీ సెలెక్టర్ మంజురుల్ ఇస్లాం తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది. ఆయన కోరిక తీర్చకపోవడంతోనే తన కెరీర్ నాశనమైందని చెప్పుకొచ్చింది. ఓ యూట్యూబ్ ఛానెల్ వేదికగా జహనారా ఆలమ్ చేసిన ఈ వ్యాఖ్యలు బంగ్లాదేశ్ క్రికెట్లో ప్రకంపనలు సృష్టించింది.
'బంగ్లాదేశ్ క్రికెటర్గా నేను ఒకసారి కాదు.. చాలా సార్లు అసభ్యకరమైన ప్రతిపాదనలు ఎదుర్కొన్నా. మేం జట్టులో ఉన్నప్పుడు చాలా విషయాల గురించి మాట్లాడలేం. నిరసన కూడా తెలియజేసే అవకాశం ఉండదు. బంగ్లాదేశ్ బోర్డ్లోని చాలామంది సీనియర్ అధికారుల మద్దతు కోరడానికి ప్రయత్నించాను.

మహిళా కమిటీ ఛైర్పర్సన్ నాదెల్ చౌదరి, బీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిజాముద్దీన్ చౌదరి దృష్టికి కూడా తీసుకెళ్లా. కానీ ఎలాంటి ఫలితం దక్కలేదు. రెండో ప్రతిపాదన 2022 ప్రపంచకప్ సమయంలో మంజు భాయ్ లైంగికంగా వేధించాడు. ఈ విషయాన్ని బోర్డు దృష్టికి కూడా తీసుకెళ్లాను. అయితే వారు తాత్కలిక పరిష్కారాన్ని చూపేవారు.
మా ప్రీ క్యాంప్ సమయంలో మంజురుల్ ఇస్లామ్ అసభ్యకరంగా తాకేవాడు. ఇతర మహిళా క్రికెటర్లతోనూ అతను ఇలాగే వ్యవహరించేవాడు. షేక్ హ్యాండ్ సమయంలోనూ అనుచితంగా ప్రవర్తించేవాడు. నా నెలసరి గురించి కూడా ఇబ్బందికరమైన ప్రశ్నలు వేసేవాడు.'అని జహనారా ఆలమ్ చెప్పుకొచ్చింది. బంగ్లాదేశ్ మహిళా కెప్టెన్.. యువ ప్లేయర్లపై చేయి చేసుకుంటుందని కూడా జహనారా ఆరోపించింది.
ఈ ఆరోపణలను మంజురుల్ ఇస్లాంతో పాటు బీసీబీ ఖండించింది. జహనారా ఆలమ్ మానసిక స్థితి బాలేక గతంలో ఆటకు బ్రేక్ ఇచ్చిందని గుర్తు చేసింది. అయితే ఈ లైంగిక ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని పేర్కొంది.