టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్లో ఆడటం తమ ఆటగాళ్లకు సురక్షితం కాదని, తమ మ్యాచ్లను శ్రీలంకకు తరలించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) ఐసీసీని కోరింది. అయితే ఈ విన్నపాన్ని ఐసీసీ తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ గ్రూప్ మ్యాచ్లు కోల్కతా, ముంబై వేదికగా ఆడాల్సి ఉంది.
అయితే ఆ మ్యాచ్లను చెన్నై, తిరువనంతపురంకు తరలిస్తామని ఐసీసీ సూచించగా.. బీసీబీ తిరస్కరించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో బంగ్లాదేశ్కు చెందిన అంపైర్ సర్ఫద్దౌలా సైకత్.. ఆదివారం వడోదర వేదికగా జరిగిన భారత్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి వన్డేకు విధులు నిర్వర్తించడం చర్చనీయాంశమైంది.
ఓవైపు తమ ఆటగాళ్లకు రక్షణ ఉండదని బీసీబీ వాదిస్తుండగా.. మరోవైపు ఆదేశానికి చెందినే వ్యక్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా అంపైరింగ్ చేశాడు కదా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే బీసీసీఐ వివరణ ఇచ్చింది. సదరు అంపైర్తో బీసీబీకి ఎలాంటి సంబంధం లేదని, అతను ఐసీసీ ప్యానెల్ అంపైర్ అని పేర్కొంది. ఎలాంటి నిరభ్యంతర ప్రతం అతనికి అవసరం లేదని స్పష్టం చేసింది.

'సైకత్.. ఐసీసీ ఫ్యానెల్ అంపైర్. అతను బీసీబీ కాంట్రాక్ట్లో లేడు. ఐసీసీ విధుల్లో ఉన్న సైకత్కు బీసీబీ అబ్జెక్షన్ సర్టిఫికేట్(ఎన్ఓసీ) అవసరం లేదు.'అని బీసీబీ అంపైర్ డిపార్ట్మెంట్ ఛైర్మన్ ఇప్తెకర రెహ్మాన్ తెలిపాడు.
భారత్లో తాము ఆడబోమనే లేఖపై ఇంకా ఐసీసీ స్పందించలేదని బీసీబీ ఛైర్మన్ అమినుల్ ఇస్లామ్ తెలిపాడు. 'మాకు ఐసీసీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఒకవేళ మేం మా మ్యాచులను శ్రీలంకలో ఆడేందుకు ఐసీసీ అనుమతించకుంటే.. భవిష్యత్తు ప్రణాళిక ఏంటో వెల్లడిస్తాం.'అని అమినుల్ ఇస్లామ్ చెప్పుకొచ్చాడు.
బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ను కేకేఆర్ జట్టు నుంచి తొలగించడంతో వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్లో హిందవులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఆ జట్టుతో క్రికెట్, దౌత్య సంబంధాలు తెంచుకోవాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వ్యక్తమైంది. కేకేఆర్ కొనుగోలు చేసిన ముస్తాఫిజుర్ రెహ్మాన్ జట్టు నుంచి తప్పించాలనే వాదన బలంగా వినిపించింది. ప్రజల సెంటిమెంట్కు తలొగ్గిన బీసీసీఐ.. ముస్తాఫిజుర్ను జట్టు నుంచి తొలగించాలని కేకేఆర్ను ఆదేశించింది. దాంతో ఆగ్రహానికి గురైన బంగ్లా ప్రభుత్వం, బీసీబీ.. ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించడంతో పాటు భారత్లో పర్యటించలేమనే వాదనను తెరపైకి తీసుకొచ్చాయి.