ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 నేపథ్యంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య దెబ్బతిన్న క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించేందుకు ఆ దేశ కొత్త ప్రభుత్వం ముందడుగు వేసింది. బంగ్లాదేశ్లో ప్రజామద్దతుతో కొత్తగా బీఎన్పీ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఈ ప్రభుత్వంలో యువజన, క్రీడల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అమీనుల్ హక్.. భారత్తో స్నేహపూర్వక చర్చల ద్వారా విభేదాలను పరిష్కరించుకుంటామని తాజాగా ప్రకటించారు.
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అమీనుల్ హక్ భారత డిప్యూటీ హైకమిషనర్తో భేటీ అయ్యారు. క్రికెట్ వివాదాలపై స్నేహపూర్వక చర్చలు జరిపి సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు. దాంతో పాకిస్థాన్కు గట్టి షాక్ తగిలనట్లు అయ్యింది. బంగ్లాదేశ్ను రెచ్చగొట్టి ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీ నుంచి బంగ్లాదేశ్ తప్పుకునేలా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తెరవెనుక రాజకీయం చేసిన సంగతి తెలిసిందే.

బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడికి నిరసనగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. దాంతో ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ రెహమాన్ను తొలగించాలని కోల్కతా నైట్రైడర్స్ జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆదేశించింది. దాంతో ఆగ్రహానికి గురైన బంగ్లా క్రికెట్ బోర్డు.. భారత్ వేదికగా జరిగే తమ ప్రపంచకప్ మ్యాచ్లను శ్రీలంకకు తరలించాలని విజ్ఞప్తి చేసింది.
అయితే బంగ్లా ఆటగాళ్ల భద్రతకు ముప్పు లేదని, అందుకు తమది హామీ అని ఐసీసీ స్పష్టం చేసింది. మ్యాచ్లు తరలించడం కుదరదని చెప్పింది. బీసీబీకి మద్దతుగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు గళం వినిపించింది. బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకునేలా పావులు కదిపింది. దాంతో ఐసీసీ బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్కు అవకాశం కల్పించింది. బంగ్లాదేశ్కు మద్దతుగా భారత్తో మ్యాచ్ను బాయ్కాట్ చేస్తున్నామని పీసీబీ డ్రామా ఆడింది. చివరకు బంగ్లాదేశ్పై ఎలాంటి చర్యలు తీసుకోమని ఐసీసీ హామీ ఇవ్వడంతో భారత్తో మ్యాచ్ ఆడి చిత్తుగా ఓడింది.
ఈ క్రమంలోనే బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల బంగ్లాదేశ్ క్రికెట్ నష్టపోయిందని భావించిన బీఎన్పీ ప్రభుత్వం.. భారత్తో క్రీడా సంబంధాలను మెరుగుపర్చుకోవడంపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే అమీనుల్ హక్ భారత్తో చర్చలు జరిపేందుకు ముందుకు వచ్చారు. ఇకపై పొరుగుదేశంతో సత్సంబంధాలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.