న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్కు ఐపీఎల్లో ఆడేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అనుమతి నిరాకరించింది. ఈ పేసర్ కోసం ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు ప్రయత్నించాయి. అయితే వచ్చేనెలలో శ్రీలంకలో బంగ్లాదేశ్ జట్టు పర్యటించాల్సి ఉండడంతో ఐపీఎల్లో ఆడేందుకు ముస్తాఫిజుర్కు 'నిరభ్యంతర పత్రం' ఇచ్చేందుకు నిరాకరించినట్టు ఆ బోర్డు క్రికెట్ ఆపరేషన్స్ ఛైర్మన్ అక్రమ్ఖాన్ చెప్పినట్లు క్రిక్బజ్ పేర్కొంది.
ఇప్పటికే ముంబై ఇండియన్స్ జట్టుకు స్టార్ పేసర్ లసిత్ మలింగ దూరం కాగా.. అతని స్థానంలో ఆస్ట్రేలియా పేసర్ జేమ్స్ పాటిన్సన్ను తీసుకుంది. అయితే, అంతకుముందు ఈ బంగ్లా పేసర్పై ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. మరోవైపు కోల్కతా ప్లేయర్ హ్యారీ గార్నీ తప్పుకోవడంతో అతడికి ప్రత్యామ్నాయ ఆటగాడు ఇంకా దొరకలేదు. ఈ నేపథ్యంలోనే ఈ జట్టు కూడా ముస్తాఫిజుర్ కోసం ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
ఇక 2018లో చివరిసారిగా ఐపీఎల్ ఆడిన ముస్తాఫిజుర్.. ముంబై ఇండియన్స్ తరఫున 7 మ్యాచ్ల్లో 7 వికెట్లు తీశాడు. మధ్యలో గాయమవ్వడంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలోనే గతేడాది కూడా అతడు ఐపీఎల్లో ఆడడానికి బంగ్లా బోర్డు నిరాకరించింది. విదేశీ లీగుల్లో ఆడితే తమ ఆటగాళ్లు అనవసరంగా గాయాలబారిన పడతారని భావించి ఆ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ నిరభ్యంతర పత్రాలు జారీ చేయడం లేదు.
CPL 2020: చెలరేగిన బ్రావో బ్రదర్స్.. నైట్రైడర్స్ సూపర్ విక్టరీ!