బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓటమిపాలయ్యామని బంగ్లాదేశ్ తాత్కాలిక కెప్టెన్ జకీర్ అలీ అన్నాడు. ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా బుధవారం భారత్తో జరిగిన సూపర్-4 మ్యాచ్లో బంగ్లాదేశ్ 41 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన జకీర్ అలీ.. పాకిస్థాన్తో మ్యాచ్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి ఫైనల్ చేరుతామని ధీమా వ్యక్తం చేశాడు. తమ బౌలర్ల అసాధారణ ప్రదర్శనతోనే టీమిండియాను సాధారణ స్కోర్కు కట్టడి చేయగలిగామని తెలిపాడు.
'టీమిండియాను కట్టడి చేయడం ఆశ్చర్యంగా అనిపించింది. కానీ ఈ క్రెడిట్ మా కుర్రాళ్లదే. తొలి 10 ఓవర్ల తర్వాత మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్ నుంచి మేం చాలా విషయాలను నేర్చుకున్నాం. గురువారం మాకు మరో మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే ఫైనల్ చేరుతాం. ఏ కాంబినేషన్తో బరిలోకి దిగాలనేది చర్చిస్తాం. పాక్పై అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాం. బ్యాటింగ్ వైఫల్యం టీమిండియా చేతిలో మా ఓటమికి కారణమైంది. భారత బౌలర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు.'అని జకీర్ అలీ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లతో 75) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. హార్దిక్ పాండ్యా(29 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 38), శుభ్మన్ గిల్(19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 29) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హొస్సేన్(2/27) రెండు వికెట్లు తీయగా.. తంజిమ్ హసన్ షకీబ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, మహమ్మద్ సైఫిద్దిన్ తలో వికెట్ తీసారు.
అనంతరం బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. ఓపెనర్ సైఫ్ హసన్(51 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్లతో 69) హాఫ్ సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. పర్వేజ్ హోస్సేన్(19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 21) మినహా మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(3/18) మూడు వికెట్లు తీయగా.. జస్ప్రీత్ బుమ్రా(2/18), వరుణ్ చక్రవర్తీ(2/29) రెండేసి వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్, తిలక్ వర్మ చెరో వికెట్ తీసారు. ఈ మ్యాచ్లో కూడా టీమిండియా ఫీల్డర్లు ఐదు క్యాచ్లు నేలపాలు చేశారు. ఇందులో నాలుగు క్యాచ్లు సైఫ్ హసన్వే కావడం గమనార్హం.