క్షమాపణలు చెప్పడంతో..
షకీబ్ బెదిరింపులపై సెల్హెట్ మెట్రోపాలిటన్ పోలీసులు మాట్లాడుతూ ‘‘ఆ బెదిరింపుల గురించి ఇప్పుడే మాకు తెలిసింది. ఆ ఫేస్బుక్ వీడియో లింక్ని సైబర్ ఫోరెన్సిక్ టీమ్కి ఇవ్వడం జరిగింది. త్వరలోనే లీగల్ యాక్షన్ తీసుకుంటాం'' అని వెల్లడించారు. అయితే.. గంటల వ్యవధిలోనే సదరు యువకుడు షకీబ్ అల్ హసన్కు క్షమాపణలు చెప్తూ మరో వీడియో చేయడం గమనార్హం. కానీ.. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఆ వీడియోలు ఉండటంతో.. రెండింటినీ ఫేస్బుక్ నుంచి తొలగించినట్లు ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు స్పష్టం చేశారు.
ఎలాంటి పూజలు చేయలేదు..
గత గురువారం కోల్కతాకు వచ్చిన షకీబ్ ఓ కాళీమాత పూజ కార్యక్రమంలో పాల్గొన్నాడని, విగ్రహం ముందు ప్రార్థనలు కూడా చేశాడని ప్రచారం జరిగింది. అయితే శుక్రవారం బంగ్లాకు చేరుకున్న షకీబ్.. తన పట్ల జరుగుతున్న ఈ అసత్య ప్రచారాన్ని ఖండిస్తూ ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చాడు. అసలు తాను ఎలాంటి పూజలు నిర్వహించలేదని, ఇన్విటేషన్ కార్డులో వేరే పేరు ప్రస్తావించడంతోనే అక్కడికి వెళ్లానని తెలిపాడు. తాను హాజరైన ఇతర ప్రోగ్రామ్లో కూడా మత సంబంధమైన కార్యక్రమాలు లేవన్నాడు. అయితే పూజ కార్యక్రమానికి హాజరైన తనను దీపాలు వెలిగించమని నిర్వాహకులు కోరితే సున్నితంగా తిరస్కరించానని తెలిపాడు. ఇక ఓ అభిమాని ఫోన్ పగలగొట్టాననే ప్రచారంలో కూడా వాస్తవం లేదని స్పష్టం చేశాడు. సెల్ఫీ కోసం ప్రయత్నించిన ఓ అభిమాని ఫోన్ ప్రమాదవశాత్తు పగిలిపోయిందని, దానికి తాను క్షమాపణలు కూడా చెప్పానన్నాడు.
నిషేధంతో దూరం..
ఐసీసీ నిషేధం కారణంగా షకీబ్ గతేడాదిగా క్రికెట్కు దూరంగా ఉంటున్నా విషయం తెలిసిందే. 2019 వన్డే ప్రపంచకప్ ముంగిట మ్యాచ్ ఫిక్సింగ్ కోసం తనని ఓ బుకీ సంప్రదించగా.. ఆ విషయాన్ని ఐసీసీ అవినీతి నిరోధక శాఖకు సమాచారం ఇవ్వకుండా షకీబ్ దాచాడు. దాంతో అతనిపై తొలుత రెండేళ్ల నిషేధం విధించిన ఐసీసీ.. ఆ తర్వాత తప్పును ఒప్పుకోవడంతో నిషేధాన్ని ఏడాదికి కుదించింది. ఈ ఏడాది అక్టోబరు 29తో అతనిపై ఉన్న నిషేధం గడువు ముగిసింది.