
దుబాయ్: టీ20 ప్రపంచకప్లో ఆడుతున్నామనే సోయి మరిచి క్రీడాస్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించిన బంగ్లాదేశ్ బ్యాట్స్మన్ లిటన్ దాస్, శ్రీలంక పేసర్ లాహిరు కుమారాపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కొరడా ఝులిపించింది. మరోసారి ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా భారీ జరిమానాతో పాటు డీమెరింట్ పాయింట్స్ విధిస్తూ కఠిన చర్యలు తీసుకుంది. గొడవకు కారణమైన లాహిరు కుమారా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించిన ఐసీసీ ఓ డీమెరిట్ పాయింట్ కూడా విధించింది. ఇక లాహిరు కుమారా మాటలతో సహనం కోల్పోయి అతనితో వాగ్వాదానికి దిగిన లిటన్ దాస్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించడంతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ కూడా విధించింది. సూపర్ 12 గ్రూప్-1లో భాగంగా ఇరు జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్లో ఈ ఇద్దరు ఆటగాళ్లు సహనం కోల్పోయిన విషయం తెలిసిందే.
అసలేం జరిగిందంటే.. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 6వ ఓవర్లో లాహిరు కుమారా వేసిన ఐదో బంతిని లిటన్ దాస్ మిడాఫ్ దిశగా ఆడగా.. ఆ దిశలో సర్కిల్లో ఫీల్డింగ్ చేస్తున్న షనక అద్భుతంగా అందుకున్నాడు. ఈ వికెట్ తీసిన ఆనందంలో లాహిరు కుమారా గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు. అతని అరుపులపై లిటన్ దాస్ అభ్యంతం వ్యక్తం చేయడంతో ఆగ్రహానికి గురైన లాహిరు కుమారా అతనిపైకి దూసుకెళ్లాడు. దాంతో మరింత ఆగ్రహానికి గురైన లిటన్ దాస్ నోటికి పనిచెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరినొకరు నెట్టేసుకునే వరకు వెళ్లింది. వెంటనే అప్రమత్తమైన అంపైర్లు, సహచర ఆటగాళ్లు ఇద్దరి ఆటగాళ్లను వారించి పక్కకు తీసుకెళ్లడంతో గొడవ సద్దుమణిగింది.
అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఈ ఇద్దరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. టీ20 ప్రపంచకప్ వంటి బిగ్ ఈవెంట్లో ఆటగాళ్లు ఇలా ప్రవర్తించడం దారుణమని చాలా మంది మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఫీల్డ్ అంపైర్లు.. మ్యాచ్ రిఫరీ ఫిర్యాదు చేయగా అతను నిబంధనల మేరకు చర్యలు తీసుకున్నారు.
ఈ మ్యాచ్లో శ్రీలంక 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 171 రన్స్ చేసింది. ఓపెనర్ మహమ్మద్ నైమ్(52 బంతుల్లో 6 ఫోర్లతో 62), సీనియర్ ప్లేయర్ ముష్ఫికర్ రహీమ్(37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 57) చెరో హాఫ్ సెంచరీతో టీమ్కు మంచి స్కోర్ అందించారు. లిటన్ దాస్(16), షకీబ్(10), కెప్టెన్ మహ్ముదుల్లా(10 నాటౌట్) కొన్ని పరుగులు చేశారు. లంక బౌలర్లలో చమిక కరుణరత్నే(1/12), బినుర ఫెర్నాండో(1/27), లాహిరు కుమార(1/29) తలో వికెట్ తీశారు.
అనంతరం లంక 18.5 ఓవర్లలో 172/5 స్కోర్ చేసి గెలిచింది. చేజింగ్లో నాలుగో బాల్కే ఓపెనర్ కుశాల్ పెరీర(1) ఔటైనా... మరో ఓపెనర్ నిసాంక(24)తో కలిసి రెండో వికెట్కు 69 రన్స్ జోడించిన అసలంక మంచి పునాది వేశాడు. అయితే 8 పరుగుల వ్యవధిలోనే నిసాంక, అవిష్కా ఫెర్నాండో(0), వానిందు హసరంగ(6) ఔటవ్వడంతో లంక 79/4తో కష్టల్లో పడింది. కానీ చరిత్ లంక అద్భుత విజయాన్నందించాడు.