
దుబాయ్: ఆసియాకప్లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న చావో రేవో పోరులో బంగ్లాదేశ్ బ్యాటర్లు దుమ్మురేపారు. మ్యాచ్కు ముందు ఇరు జట్ల మధ్య మాటల తూటాలు పేలడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బంగ్లాదేశ్ చెప్పినట్లుగానే రికార్డు స్కోర్తో లంక ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 183 పరుగుల భారీ స్కోర్ చేసింది. యూఏఈ గడ్డపై బంగ్లాకు ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం.
బంగ్లా జట్టులో మెహిదీ హసన్ మీర్జా (26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 38), అఫిఫ్ హోస్సెన్ (22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 39) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మొసాద్దేక్ హోస్సెన్(9 బంతుల్లో 4 ఫోర్లు 24 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. లంక బౌలర్లలో హసరంగా, కరణరత్నే రెండేసి వికెట్లు తీయగా.. దిల్లాన్, మహీశ్ తీక్షణ, ఫెర్నాండో తలో వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్కు ముందు మీడియా సమావేశంలో శ్రీలంక సారథి డసన్ షనక.. బంగ్లాదేశ్ పసికూన అంటూ పేర్కొన్నాడు. ఆ జట్టులో ఇద్దరే ఇద్దరు ప్రపంచ స్థాయి ప్లేయర్లున్నారని, అఫ్గాన్ కంటే చాలా బలహీనమైన జట్టని అభిప్రాయపడ్డాడు. ఈ వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ టీమ్ డైరెక్టర్ ఖలీద్ మహమూద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమకు ఇద్దరైనా ప్రపంచస్థాయి బౌలర్లు ఉన్నారని, శ్రీలంకలో వారు కూడా లేరని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
దాంతో ఈ మ్యాచ్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బంగ్లా విజయమే లక్ష్యంగా బరిలోకి దిగింది. టాస్ సందర్భంగా బంగ్లా సారథి షకీబ్ అల్ హసెన్ సైతం పరోక్షంగా ఈ వ్యాఖ్యలపై స్పందించాడు. టాస్ గెలిస్తే తాము ఫీల్డింగ్ ఎంచుకునే వాళ్లమని, కానీ అది మన చేతుల్లో లేదని షకీబ్ చెప్పాడు. అఫ్గాన్తో బ్యాటింగ్లో విఫలమయ్యామని చెప్పిన షకీబ్.. ఈ రోజు భిన్నంగా ఉంటుందని చెప్పాడు. జట్టులో మూడు కీలక మార్పులతో బరిలోకి దిగుతున్నామని, శ్రీలంకకు తమ సత్తా ఏంటో చూపిస్తామన్నాడు. మీడియాలో మాట్లాడిన విషయాలను పెద్దగా పట్టించుకోమని, గుడ్ క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తామని తెలిపాడు.