ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో న్యూజిలాండ్ జోరు కొనసాగుతోంది. బంగ్లాదేశ్తో సోమవారం జరిగిన కీలక మ్యాచ్లో సమష్టిగా రాణించిన న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలింగ్లో మైకేల్ బ్రేస్ వేల్.. బ్యాటింగ్లో రచిన్ రవీంద్ర సత్తా చాటడంతో న్యూజిలాండ్ సునాయస విజయాన్నందుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 236 పరుగులు చేసింది. కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో(110 బంతుల్లో 9 ఫోర్లతో 77) హాఫ్ సెంచరీతో రాణించగా.. జకేర్ అలీ(55 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 45) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో మైకేల్ బ్రేస్వెల్(4/26) నాలుగు వికెట్లు తీయగా.. విల్ రూర్కీ(2/48) రెండు వికెట్లు పడగొట్టాడు. మ్యాట్ హెన్రీ, కైల్ జెమీసన్ తలో వికెట్ తీసారు.

శతక్కొట్టిన రచిన్..
అనంతరం న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో 5 వికెట్లకు 240 పరుగులు చేసి గెలుపొందింది. రచిన్ రవీంద్ర(105 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్తో 112) సెంచరీతో చెలరేగగా.. టామ్ లాథమ్(76 బంతుల్లో 3 ఫోర్లతో 55) హాఫ్ సెంచరీతో రాణించాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హోస్సేన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, నహిద్ రాణా, టస్కిన్ అహ్మద్ తలో వికెట్ తీసారు.
పిచ్ స్లోగా ఉండటంతో పాటు ఆరంభంలోనే విల్ యంగ్(0), కేన్ విలియమ్స్(5) ఔటవ్వడంతో కాస్త ఉత్కంఠ నెలకొంది. కానీ రచిన్ రవీంద్ర.. డెవాన్ కాన్వే, టామ్ లాథమ్తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. విజయం ముంగిట రచిన్, లాథమ్ ఔటవ్వగా.. గ్లేన్ ఫిలిప్స్(21 నాటౌట్), బ్రేస్ వెల్(11 నాటౌట్) విజయలాంఛనాన్ని పూర్తి చేశారు.
పాకిస్థాన్ ఔట్..
ఈ విజయంతో గ్రూప్-ఏ నుంచి న్యూజిలాండ్ సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. గ్రూప్-ఏ నుంచి రెండేసి మ్యాచ్లు గెలిచిన భారత్, న్యూజిలాండ్ సెమీఫైనల్కు అర్హత సాధించాయి. అయితే గ్రూప్-ఏ టాపర్ ఎవరా? అనేది ఇరు జట్ల మధ్య ఆదివారం(మార్చి 2) జరిగే మ్యాచ్ ఫలితం నిర్ణయించనుంది. న్యూజిలాండ్ తాజా విజయంతో గ్రూప్-ఏలోనే ఉన్న ఆతిథ్య పాకిస్థాన్, బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి.
1996 వన్డే ప్రపంచకప్ తర్వాత ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్.. లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టడం ఆ దేశ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన పాక్ ఘోర పరాజయాలను నమోదు చేసింది. న్యూజిలాండ్, భారత్ చేతిలో చిత్తుగా ఓడింది.