
ఢాకా: బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మరోసారి దుమ్మురేపింది. ఆస్ట్రేలియాపై సిరీస్ కైవసం చేసుకొని తాము పసికూనలం కాదని యావత్ క్రికెట్ ప్రపంచానికి చాటిచెప్పిన బంగ్లాదేశ్.. తాజాగా టాప్ టీమ్ అయిన న్యూజిలాండ్కు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా ఢాకా వేదికగా బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్నందుకుంది. తద్వారా ఆతిథ్య జట్టు కివీస్పై తొలి టీ20 విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 16.5 ఓవర్లలో 60 పరుగులకే కుప్పకూలింది.
బంగ్లా బౌలర్లు ముస్తాఫిజుర్ రెహ్మాన్ (3/13), నసుమ్ అహ్మద్(2/5), షకీబ్ అల్ హసన్(2/10), మహమ్మద్ సైఫుద్దీన్ (2/7) కివీస్ పతనాన్ని శాసించారు. వారి దెబ్బకు న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లో టామ్ లాథమ్(25 బంతుల్లో 1 ఫోర్ 18), హెన్రీ నికోల్స్(24 బంతుల్లో 1 ఫోర్తో 18) మినహా మిగతా బ్యాట్స్మెన్ అంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. కివీస్ ఇన్నింగ్స్ మొత్తం మూడు ఫోర్లు మాత్రమే వచ్చాయి. దాంతో టీ20 క్రికెట్లో న్యూజిలాండ్ లోయెస్ట్ స్కోర్ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇప్పటి వరకు టీ20ల్లో కివీస్కు ఇదే అత్యల్ప స్కోర్.
అంతకుముందు 2014లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లోనూ న్యూజిలాండ్ 60 పరుగులకే ఆలౌటైంది. తాజాగా మరోసారి అదే స్కోర్కు కుప్పకూలింది. అంతకుముందు 2010లో పాకిస్థాన్ చేతిలో 80 పరుగులకు ఆలౌటైన కివీస్.. అదే ఏడాది శ్రీలంక చేతిలో 81 పరుగులకు కుప్పకూలింది. ఇప్పటి వరకు టీ20ల్లో కివీస్కు ఇవే అత్యల్ప స్కోర్లు.
ఇక బంగ్లాదేశ్పై అత్యల్ప స్కోర్కు ఆలౌటైన జట్టుగానూ కివీస్ అప్రతిష్టను మూటగట్టుకుంది. ఇప్పటి వరకు ఈ చెత్త రికార్డు ఆస్ట్రేలియా(62 ఆలౌట్) పేరిట ఉండగా.. తాజా మ్యాచ్తో కివీస్ దాన్ని అధిగమించింది. ఈ జాబితాలో అఫ్గానిస్థాన్(72), యూఏఈ(82) కూడా ఉన్నాయి. 61 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 15 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసి 30 బంతులు మిగిలుండగానే సునాయస విజయాన్నందుకుంది. ఓపెనర్లు మహమ్మద్ నైమ్(1), లిటన్ దాస్(1) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగినా.. షకీబ్ అల్ హసన్(33 బంతుల్లో 25) రాణించాడు. ముస్తాఫికర్ రహీమ్(16 నాటౌట్), మహ్మదుల్లా(14 నాటౌట్) విజయలాంచనాన్ని పూర్తి చేశారు. ఇక ఈ మ్యాచ్కు న్యూజిలాండ్ రెగ్యూలర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, సీనియర్ ప్లేయర్లు మార్టిన్ గప్టిల్, డేవన్ కాన్వే, గ్లేన్ ఫిలిప్స్ దూరంగా ఉన్నారు.