
ఢాకా: సొంతగడ్డపై బంగ్లాదేశ్ జోరు కొనసాగుతోంది. న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరీస్లో భాగంగా శుక్రవారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన రెండో టీ20లో బంగ్లాదేశ్ నాలుగు పరుగుల తేడాతో గెలుపొందింది. ఇప్పటికే ఫస్ట్ టీ20లో పటిష్ట కివీస్ను చిత్తు చేసిన బంగ్లా పులులు.. రెండో టీ20లోను అదే జోరును కొనసాగిస్తూ 2-0తో ఆధిక్యంలో దూసుకెళ్లింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 141 రన్స్ చేసింది. ఓపెనర్లు మహమ్మద్ నైమ్(39), లిటన్ దాస్(33) మంచి శుభారంభాన్ని అందివ్వగా.. కెప్టెన్ మహ్మదుల్లా(37 నాటౌట్) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో రచిన్ రవీంద్ర మూడు వికెట్లు తీయగా.. హమిష్ బెన్నెట్, కోల్ మెక్కోచిల్, అజాజ్ పటేల్ తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 137 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ టాప్ లాథమ్(65 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగినా ఫలితం లేకుండా పోయింది. అతనికి తోడు మరే బ్యాట్స్మన్ రాణించకపోవడంతో కివీస్ ఓటమికి తలవంచింది. విల్ యంగ్(22) మినహా అంతా విఫలమయ్యారు. చివరి ఓవర్లో న్యూజిలాండ్ విజయానికి 20 పరుగులు అవసరమవ్వగా.. ముస్తాఫిజుర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి తొలి మూడు బంతుల్లో 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక నాలుగో బంతికి సింగిల్ రాగా.. ఐదో బంతిని నోబాల్ వేయగా.. లాథమ్ బౌండరీకి తరలించాడు. ఆ తర్వాత లెగ్ బై రూపంలో రెండు రన్స్ వచ్చాయి. చివరి బంతికి సిక్స్ కొడితే విజయం సాధించే పరిస్థితి ఏర్పడగా.. సింగిల్ మాత్రమే వచ్చింది. దాంతో బంగ్లా అద్భుత విజయాన్నందుకుంది.
ఇక ఫస్ట్ టీ20లో న్యూజిలాండ్ 60 పరుగులకే ఆలౌటై ఏడు వికెట్లతో చిత్తయిన విషయం తెలిసిందే. దాంతో టీ20 క్రికెట్లో న్యూజిలాండ్ లోయెస్ట్ స్కోర్ చెత్త రికార్డును మూటగట్టుకుంది. అంతకుముందు 2014లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లోనూ న్యూజిలాండ్ 60 పరుగులకే ఆలౌటైంది. తాజాగా మరోసారి అదే స్కోర్కు కుప్పకూలింది. అంతకుముందు 2010లో పాకిస్థాన్ చేతిలో 80 పరుగులకు ఆలౌటైన కివీస్.. అదే ఏడాది శ్రీలంక చేతిలో 81 పరుగులకు కుప్పకూలింది. ఇప్పటి వరకు టీ20ల్లో కివీస్కు ఇవే అత్యల్ప స్కోర్లు.