
ఢాకా: బంగ్లాదేశ్తో జరుగుతున్న మూడో టీ20తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఆస్ట్రేలియా యువ పేసర్ నాథన్ ఎల్లిస్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. తన ఫస్ట్ మ్యాచ్లోనే హ్యాట్రిక్ సాధించాడు. తద్వారా టీ20 క్రికెట్లో అరంగేట్ర మ్యాచ్లోనే హ్యాట్రిక్ తీసిన తొలి బౌలర్గా గుర్తింపుపొందాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్లో చివరి ఓవర్ వేసిన ఎల్లిస్.. చివరి మూడు బంతుల్లో మహ్మదుల్లా(53 బంతుల్లో 4 ఫోర్లతో 52), ముస్తాఫిజుర్(0), మెహ్ది హసన్(6)లను పెవిలియన్ చేర్చి అరుదైన ఫీట్ సాధించాడు. ముందుగా హాఫ్ సెంచరీ సాధించిన మహ్మదుల్లాను క్లీన్ బౌల్డ్ చేసిన ఎల్లిస్.. ఆ తర్వాత ముస్తాఫిజుర్ను , మెహ్దీ హసన్లను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు.
చివరి టీ20 ముందు రిలే మెరిడిత్ గాయపడటంతో అతని స్థానంలో జట్టులోకి వచ్చిన ఎల్లిస్.. తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతుల అందిపుచ్చుకున్నాడు. ఈ మ్యాచ్లో ఎల్లిస్ దెబ్బకు ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులు చేసింది. కెప్టెన్ మహ్మదుల్లా(52), షకీబ్ అల్ హసన్(26) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎల్లిస్(3/34)కు తోడుగా జోష్ హజెల్ వుడ్, ఆడమ్ జంపా రెండేసి వికెట్లు తీసారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా రెండో ఓవర్లోనే ఓపెనర్ మాథ్యూ వేడ్ వికెట్ కోల్పోయింది. ఈ టూర్కు ఆస్ట్రేలియా సీనియర్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఐదు టీ20ల సిరీస్లో తొలి రెండు గెలిచిన ఆతిథ్య బంగ్లాదేశ్ 2-0తో లీడ్లో ఉంది. ఈ మ్యాచ్ గెలవడం ఆసీస్కు కీలకం. ఈ మ్యాచ్ గెలవకుంటే సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉంది.