టీ20 ప్రపంచకప్ 2024లో ఆస్ట్రేలియా జైత్రయాత్ర కొనసాగుతోంది. బంగ్లాదేశ్తో శుక్రవారం ఉదయం జరిగిన సూపర్-8 మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా డక్వర్త్ లూయిస్ పద్దతిన 28 పరుగుల తేడాతో గెలిచింది.
ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు డక్వర్త్ లూయిస్ పద్దతిన ఫలితాన్ని తేల్చారు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 140 పరుగులే చేసింది. ప్యాట్ కమిన్స్(3/29) హ్యాట్రిక్ వికెట్తో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించాడు. బంగ్లాదేశ్ బ్యాటర్లలో టౌహిడ్ హృదయ్(28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 40), నజ్ముల్ హోస్సేన్ షాంటో(36 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 41) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

ఆస్ట్రేలియా బౌలర్లలో ప్యాట్ కమిన్స్తో పాటు ఆడమ్ జంపా(2/24) రెండు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినీస్, గ్లేన్ మ్యాక్స్వెల్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా వర్షం అంతరాయం కలిగించే సమయానికి 8.5 ఓవర్లలో 2 వికెట్లకు 100 పరుగులు చేసింది. క్రీజులో డేవిడ్ వార్నర్(35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 53 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. ట్రావిస్ హెడ్(21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 31) ధాటిగా ఆడాడు. మిచెల్ మార్ష్(1) విఫలమైనా.. గ్లేన్ మ్యాక్స్వెల్(14 నాటౌట్)అజేయంగా నిలిచాడు. స్వల్ప లక్ష్యచేధనకు దిగిన ఆసీస్కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్ అదిరిపోయే ఆరంభం అందించారు.
తొలి వికెట్కు 6.5 ఓవర్లలో 65 పరుగులు జోడించారు. మిచెల్ మార్ష్ విఫలమైనా.. మ్యాక్సీ సాయంతో డేవిడ్ వార్నర్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్వల్ప లక్ష్యమే అయినా.. దూకుడుగా ఆడటం ఆసీస్కు కలిసొచ్చింది. నెమ్మదిగా ఆడి ఉంటే వర్షం కారణంగా డక్ వర్త్ లూయిస్ లెక్కలు తారుమారు అయ్యేవి. ఆదివారం జరిగే మ్యాచ్లో ఆస్ట్రేలియా అఫ్గానిస్థాన్తో రెండో సూపర్-8 మ్యాచ్ ఆడనుంది. సోమవారం భారత్తో చివరి సూపర్ మ్యాచ్లో తలపడనుంది.