
ఢిల్లీ: మోకాలి గాయంతో బాధపడుతున్న భారత స్టార్ రెజ్లర్, టోక్యో ఒలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్ బజరంగ్ పూనియా రెజ్లింగ్ చాంపియన్షిప్ నుంచి తప్పుకున్నాడు. ఒలింపిక్స్కు ముందే అతనికి ఈ గాయం కాగా, అలాగే ఆటను కొనసాగించిన బజరంగ్ ఇప్పుడు చికిత్స కోసం విరామం తీసుకుంటున్నాడు. అతని మోకాలి లిగమెంట్లో టియర్ రావడంతో పూర్తిగా కోలుకునేందుకు కనీసం ఆరు వారాల సమయం పడుతుందని వైద్యులు తేల్చడంతో అక్టోబర్ 2 నుంచి నార్వేలో జరిగే టోర్నీకి అతను దూరమయ్యాడు.
తాజాగా పరీక్షలు చేసుకోగా.. బజరంగ్ గాయం తీవ్రత తెలిసింది. 'నా మోకాలి లిగమెంట్లో టియర్ వచ్చింది. 6 వారాల రిహాబిలిటేషన్ అవసరమని డాక్టర్ చెప్పారు. దాంతో ప్రతిష్టాత్మక రెజ్లింగ్ వరల్డ్ చాంపియన్షిప్లో పాల్గొనలేకపోతున్నా. ఈ క్యాలండర్ ఇయర్లో ఇదే అతిపెద్ద టోర్నీ. ఈ ఏడాది జరిగే ఇతర టోర్నీల్లో కూడా పాల్గొనను'అని బజరంగ్ చెప్పుకొచ్చాడు.
టోక్యో ఒలింపిక్స్కు ముందు రష్యా వేదికగా జరిగిన అలీ అలియేవ్ టోర్నీ సందర్భంగా స్థానిక రెజ్లర్ అబుల్మాజిద్ కుదియేవ్తో పోరులో బజ్రంగ్ గాయపడ్డాడు. అతిపెద్ద ఈవెంట్కు ముందు గాయం బారిన పడటం వల్ల కొంత నిరాశకు లోనయ్యాడు. ప్రాక్టీస్కు దూరమయ్యాడు. అయినా వైద్యుల సూచనల మేరకు కాలికి పట్టీలు ధరించి విశ్వక్రీడల బరిలోకి దిగాడు. ఒత్తిడిని ఏ మాత్రం దరిచేయకుండా రాణించి పతకం సాధించాడు. 65 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ సెమీస్లో బజరంగ్ పునియా అజర్ బైజానికి చెందిన హాజీ అలియెవ్ చేతిలో ఓడినా.. కీలక బ్రాంజ్ ఫైట్లో కజకిస్తాన్కు చెందిన దౌలెట్ నియాజ్బెకొవ్ను చిత్తు చేసి మెడల్ దక్కించుకున్నాడు.

ఒలింపిక్స్ విజయానంతరం బజరంగ్ పునియా మాట్లాడుతూ... గాయం కారణంగానే సెమీస్లో ఓటమిపాలయ్యానని తెలిపాడు. 'ఒలింపిక్స్ 2020కు ముందు నా కుడి మోకాలికి గాయమైంది. దీంతో విశ్వ క్రీడల్లో ఆడటంపై సందిగ్ధత ఏర్పడింది. డాక్టర్ల సూచనలతో టోక్యోలో మ్యాచ్లు ఆడాను. వారు నా మోకాలికి పట్టీలు ఇచ్చారు.ప్లేఆఫ్కు మ్యాచ్లకు కాలికి పట్టీ ధరించి ఆడాల్సి వచ్చింది. దీంతో నా ఫుట్వర్క్ కదలికలకు అడ్డంకి ఏర్పడింది. అందుకే సెమీస్లో ఓడిపోయాను. దీంతో కాంస్య పతక పోరులో నేను పట్టి లేకుండానే బరిలోకి దిగాలని నిశ్చయించుకున్నాను. కాలి గాయం ఎక్కువైనా సరే.. పతకమైతే గెలవాలనుకున్నా. చివరికి కాలు విరిగితే సర్జరీ చేయించుకోవడానికి సిద్ధపడ్డాను' అని తెలిపాడు.
'సెమీస్లో హజీ అలియెవ్ చేతిలో ఓటమి తర్వాత నా గదిలోకి వెళ్లి త్వరగా పడుకున్నా. ఎవరితోనూ మాట్లాడాలని అనిపించలేదు. ఆ తర్వాత ఇంటికి ఫోన్ చేసి అమ్మతో చాలా సమయం మాట్లాడా. రెజ్లింగ్ కన్నా ఎక్కువగా నా గాయం గురించే అమ్మ భయపడుతున్నట్టు చెప్పింది. గెలుపోటములు ఆటలో భాగమంది. ముందు నా మోకాలిని రక్షించుకోవాలని సూచించింది. పతకం కన్నా నా ఆరోగ్యమే ముఖ్యమని అమ్మ చెప్పింది' అని బజరంగ్ పూనియా అన్నాడు.
'పిల్లలు మెడల్స్ గెలవాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. గాయంతోనే గెలిచిన ఈ కాంస్యం తమకు బంగారంతో సమానమని నా కుటుంబ సభ్యులు అన్నారు. ఎందుకంటే గాయం వల్ల నేను రష్యాలో 20-25 రోజులు మ్యాటుకు దూరమయ్యాననే విషయం వారికి తెలుసు. పతకం వచ్చినందుకు వారు చాలా ఆనందించారు' అని బ్రాంజ్ మెడలిస్ట్ బజరంగ్ పునియా వెల్లడించాడు.