ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) శనివారం ప్రకటించనుంది. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడిన ఆటగాళ్లలో చాలా మంది ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికవ్వనున్నారు. స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో భారత్-ఏ తరఫున ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తున్న కుర్రాళ్లలో కూడా కొంతమందికి సీనియర్ టీమ్లో చోటు దక్కనుంది.
మూడు టెస్ట్లకే బుమ్రా..
భారత పేస్ విభాగాన్ని జస్ప్రీత్ బుమ్రా నడిపించనున్నాడు. అయితే టీమ్ సెలెక్షన్కు ముందు బుమ్రా.. బీసీసీఐకి బ్యాడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఫిట్నెస్ సమస్యల నేపథ్యంలో తాను ఐదు టెస్ట్లు ఆడలేనని బుమ్రా బీసీసీఐకి సమాచారం ఇచ్చాడని ఇండియన్ ఎక్స్ప్రెస్ పేర్కొంది. మూడు టెస్ట్ల కంటే ఎక్కువ ఆడలేనని, అందుకు తన శరీరం సహకరించదని బుమ్రా.. సెలెక్టర్లకు స్పష్టం చేసినట్లు తెలిపింది. ఆస్ట్రేలియా పర్యటనలో బుమ్రా ఐదు మ్యాచ్లకు ఐదు ఆడి వెన్ను గాయానికి గురయ్యాడు. ఆఖరి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో గాయపడిన అతను సుదీర్ఘ కాలం జట్టుకు దూరమయ్యాడు. మళ్లీ ఐపీఎల్ 2025తోనే రీఎంట్రీ ఇచ్చాడు.

కెప్టెన్గా సత్తా చాటినా..
వెన్ను నొప్పి నేపథ్యంలోనే జస్ప్రీత్ బుమ్రాను టీమిండియా లీడర్షిప్ గ్రూప్ నుంచి తప్పించినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే బుమ్రా పలుసార్లు వెన్ను గాయానికి గురయ్యాడు. బుమ్రా గత మూడేళ్లుగా టెస్ట్ల్లో రోహిత్ శర్మకు డిప్యూటిగా వ్యవహరించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో హిట్ మ్యాన్ గైర్హాజరీలో జట్టును నడిపించి అద్భుత విజయాన్ని కూడా అందించాడు. బౌలింగ్లో అసాధారణ ప్రదర్శన కనబర్చాడు.
కెప్టెన్గా శుభ్మన్ గిల్..?
టీమిండియా టెస్ట్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ఇప్పటికే పలు నివేదికలు వెలువడ్డాయి. అయితే శుభ్మన్ గిల్ ఇప్పటికే టెస్ట్ ఫార్మాట్లో లీడర్షిప్ గ్రూప్లో లేడు. కానీ టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం జింబాబ్వే పర్యటనలో తొలిసారి టీ20 ఫార్మాట్లో టీమిండియాను నడిపించాడు. శ్రీలంక పర్యటనతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో రోహిత్ శర్మకు డిప్యూటీగా వ్యవహరించాడు. టెస్ట్ల్లో గిల్ కెప్టెన్గా ఎంపికైతే రిషభ్ పంత్కు వైస్ కెప్టెన్సీ దక్కే అవకాశాలు ఉన్నాయి. 2018 నుంచి రిషభ్ పంత్ టెస్ట్ల్లో రెగ్యులర్గా ఆడుతున్నాడు.