ఫైనల్ ఆడుతామంటూ..
వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ 2022-23 ఫైనల్కు పాకిస్థాన్ చేరుతుందని బాబర్ ఆజామ్ ధీమా వ్యక్తం చేశాడు. 'మేం వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడేందుకు ఆశగా ఎదురుచూస్తున్నాం. ఇది చాలా ముఖ్యమైన సిరీస్. వచ్చే ఐదు టెస్టుల్లో మేం నాలుగు గెలిచినా, ఫైనల్ ఆడేందుకు అవకాశం ఉంటుంది. ఈ సిరీస్కి ముందు మాకు కావాల్సినంత విశ్రాంతి లభించింది.
మా టీమ్లో కొందరు ఇప్పటికే ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడి రెడ్ బాల్ క్రికెట్కు కావాల్సిన ప్రాక్టీస్ సంపాదించుకున్నారు. మా బౌలింగ్ యూనిట్ చాలా బలంగా ఉంది. ఇంగ్లండ్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తాం. నసీం షా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. మేం ఈ టెస్టు సిరీస్ గెలుస్తామనే నమ్మకం ఉంది...'అని ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో తెలిపాడు.
|
లక్కీగా ఫైనల్ చేరినట్టా..?
అయితే ఈ వ్యాఖ్యలపై ఫ్యాన్స్ సెటైర్లు పేల్చుతున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడటం అంటే టీ20 ప్రపంచకప్ మాదిరి లక్కీగా ఫైనల్ చేరడం అనుకుంటున్నావా? అని ప్రశ్నిస్తున్నారు. టీ20 ప్రపంచకప్లో భారత్, జింబాబ్వే చేతిలో ఓడిన పాకిస్థాన్.. నెదర్లాండ్స్ పుణ్యమా లక్కీగా సెమీస్ చేరింది.
సౌతాఫ్రికాను నెదర్లాండ్స్ ఓడించడంతో పాక్కు లైన్ క్లియరైంది. సెమీఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించిన పాక్.. ఫైనల్లో ఇంగ్లండ్పై మాత్రం గెలవలేకపోయింది. లక్ మాత్రమే ఉంటే సరిపోదనే విషయం పాక్ జట్టుకు బోధపడింది. ఈ క్రమంలోనే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడుతామని బాబర్ ఆజామ్ వ్యాఖ్యానించడం తమకు నవ్వులు తెప్పిస్తోందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఒక్క మ్యాచ్ ఓడినా..
డబ్ల్యూటీసీలో భాగంగానే పాకిస్థాన్.. ఇంగ్లండ్తో మూడు టెస్ట్ల సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్లో పాక్ 2-0, 3-0తో గెలిచినా ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఒక్క మ్యాచ్లో ఓడినా అవకాశాలు సంక్లిష్టంగా మారుతాయి. బెన్ స్టోక్స్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన తర్వాత 'బజ్ బాల్' కాన్సెప్ట్తో దుమ్మురేపుతున్న ఇంగ్లండ్.. గత 7 మ్యాచ్ల్లో 5 విజయాలందుకుంది. డబ్ల్యూటీసీ 2021-23 సైకిల్ ఆరంభంలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న ఇంగ్లండ్ ఫైనల్ చేరే అవకాశాలను కోల్పోయింది. ఈ పరాజయాలతోనే జోరూట్ కెప్టెన్సీ వదిలేసి బెన్ స్టోక్స్ అప్పగించాడు.
ఇంగ్లండ్ శుభారంభం..
తాజాగా జరుగుతున్న రావల్పిండి టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు ఓపెనర్లు జాక్ క్రాలీ(108 నాటౌట్) సెంచరీ చేయగా.., బెన్ డక్లెట్(90) శతకానికి సమీపంగా ఉన్నాడు. ఈ ఇద్దరు పాక్ బౌలర్లు చెడుగుడు ఆడుకుంటున్నారు. లంచ్ బ్రేక్ సమయానికి వికెట్ నష్టపోకుండా 27 ఓవర్లలో 174 పరుగులు చేసిన ఇంగ్లండ్.. రెండో సెషన్లోనూ అదే జోరు కొనసాగిస్తోంది.