ఒక్క మ్యాచ్ గెలవరా..?
ఈ ఘోర పరాభావంపై పాకిస్థాన్ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంగ్లండ్ చేతిలో ఎదురైన ఘోర పరాభావంతో బాబర్ ఆజామ్ కెప్టెన్గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. సొంతగడ్డపై వరుసగా నాలుగు టెస్ట్ మ్యాచ్లు ఓడిన తొలి పాక్ కెప్టెన్గా బాబర్ ఆజామ్ అప్రతిష్టపాలయ్యాడు.
దాంతో బాబర్ ఆజామ్ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. బాబర్ ఆజామ్ను కెప్టెన్సీ నుంచి తప్పించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.
కెప్టెన్సీకే ఎసరు..
సొంతగడ్డపై మూడు టెస్ట్ల సిరీస్ల్లో ఒక్క మ్యాచ్ గెలవకపోవడం చాలా దారుణమని, ఈ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ బాబర్ ఆజామ్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ సిరీస్లో బాబర్ ఆజామ్ బ్యాట్తో పర్వాలేదనిపించినా.. ఓ సెంచరీతో పాటు మూడు హాఫ్ సెంచరీలు బాదినా.. అవి పాక్ విజయానికి సరిపోలేదు.
మైదానంలో బాబర్ ఆజామ్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు జట్టు పతనాన్ని శాసించాయని ఆ జట్టు మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఈ పరిణామాలు అతని కెప్టెన్సీకే ఎసరు పెట్టేలా మారడం ఖాయంగా కనిపిస్తోంది. విజయాలు అందించకపోతే మాత్రం బాబర్ ఆజమ్ తన కెప్టెన్సీని వదులుకోవాల్సి రావొచ్చని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ఇగోను పక్కనపెట్టి ఉంటే..
పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా అయితే బాబర్ కెప్టెన్సీపై మండిపడ్డాడు. అతను అసలు జట్టుకు నాయకత్వం వహించడానికి పనికిరాడన్నాడు. 'ఒక కెప్టెన్గా బాబర్ పెద్ద జీరో. జట్టుకు నాయకత్వం వహించడానికి అతను పనికిరాడు. ఆ అర్హతే తనకు లేదు. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో అతను కెప్టెన్గా అస్సలు పనికిరాడు. బెన్స్టోక్స్, బ్రెండన్ మెకల్లమ్ వంటి వాళ్లను చూసి కెప్టెన్సీ నేర్చుకునే అవకాశం ఉన్నా ఉపయోగించుకోలేదు. అంతెందుకు ఈగో పక్కన పెట్టి టెస్టు సిరీస్కు ఎంపికైన సర్ఫరాజ్ అహ్మద్ సలహాలను తీసుకున్నా..బాగుండేది' అని కనేరియా ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇంగ్లండ్ ఘన విజయం..
మంగళవారం ముగిసిన మూడో టెస్ట్లో సమష్టిగా చెలరేగిన ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 167 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 28.1 ఓవర్లలో 2 వికెట్లకు 170 పరుగులు చేసి ఘన విజయాన్నందుకుంది. బెన్ డక్కెట్(78 బంతుల్లో 12 ఫోర్లతో 82 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. బెన్ స్టోక్స్(35 నాటౌట్), జాక్ క్రాలీ(41) రాణించారు.
పాక్ బౌలర్లలో అబ్రర్ అహ్మద్కు రెండేసి వికెట్లు దక్కాయి. 112/2 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. మరో 11.1 ఓవర్లలోనే మిగిలిన 55 పరుగులు చేసి విజయ లాంఛనాన్ని పూర్తి చేసింది.


Click it and Unblock the Notifications












