కొలంబో: చెత్త ఫీల్డింగ్, పేలవ బౌలింగ్.. శ్రీలంక చేతిలో తమ ఓటమిని శాసించిందని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తెలిపాడు. ఆసియాకప్ 2023లో భాగంగా గురువారం జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో పాకిస్థాన్ 2 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో విజయం సాధించిన శ్రీలంక ఫైనల్కు దూసుకెళ్లింది.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన బాబర్ ఆజామ్.. మిడిల్ ఓవర్లలో కట్టడిగా బౌలింగ్ చేయకపోవడం తమ ఓటమిని శాసించిందని తెలిపాడు. 'చివర్లో ఇఫ్తికర్ అహ్మద్, షాహిన్ అఫ్రిదిలో ఎవరితో బౌలింగ్ చేయాలనే సందేహం వచ్చింది. మేం మా బెస్ట్ బౌలర్ను ఎంచుకోవాలనుకున్నాం. అందుకే షాహిన్ అఫ్రిదిని ఎంచుకున్నాను. ఫైనల్ ఓవర్ను జమాన్ ఖాన్తో వేయించాం. దురదృష్టవశాత్తు అది వర్కౌట్ కాలేదు.

శ్రీలంక అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. మా కంటే మెరుగైన క్రికెట్ ఆడింది. అందుకే ఆ జట్టు గెలిచింది. బౌలింగ్, ఫీల్డింగ్లో మేం మా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాం. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో సరిగ్గా బౌలింగ్ చేయకపోవడం మా ఓటమిని శాసించింది. కుశాల్ మెండీస్, సమరవిక్రమా భాగస్వామ్యం దెబ్బతీసింది.
బౌలింగ్లో అద్భుతంగా ప్రారంభించిన మేము.. ముగింపులో కూడా సత్తా చాటాం. కానీ మిడిల్ ఓవర్లలోనే వికెట్లు తీయలేకపోయాం.'అని బాబర్ ఆజామ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 42 ఓవర్లలో 7 వికెట్లకు 252 పరుగులు చేసింది. మహమ్మద్ రిజ్వాన్ (73 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 86 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఇఫ్తికర్ అహ్మద్ (40 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 47) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
శ్రీలంక బౌలర్లలో మతీష పతీరణ(3/65) మూడు వికెట్లు తీయగా.. ప్రమోద్ మధుషాన్(2/58) రెండు వికెట్లు పడగొట్టాడు. మహీశ్ తీక్షణ, దునీత్ వెల్లలాగే(1/40)లకు తలో వికెట్ దక్కింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక నిర్ణీత 42 ఓవర్లలో 252 పరుగులే చేసి గెలుపొందింది.
కుశాల్ మెండీస్(87 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 91), సదీర సమరవిక్రమా(51 బంతుల్లో 4 ఫోర్లతో 48), చరిత్ అసలంక(47 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 49 నాటౌట్) రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో ఇఫ్తికర్ అహ్మద్(3/50) మూడు వికెట్లు తీయగా.. షాహిన్ షా అఫ్రిది(2/52) రెండు వికెట్లు పడగొట్టాడు. ఆదివారం జరిగే ఫైనల్లో భారత్-శ్రీలంక తలపడనున్నాయి.