
దుబాయ్: పేలవ బ్యాటింగ్తోనే భారత్ చేతిలో ఓటమిపాలయ్యామని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అన్నాడు. తమ బౌలర్లు అద్భుతంగా రాణించారని, బ్యాటింగ్లో మరిన్నీ పరుగులు చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఆసియాకప్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో పాక్పై భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా సూపర్ బ్యాటింగ్తో భారత్ విజయాన్నందుకుంది. అయితే ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన బాబర్ ఆజామ్.. తాము విధించిన లక్ష్యం సరిపోలేదని, 10-15 పరుగులు ఎక్కువ చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు.
'బంతితో మేం అద్భుతంగా ప్రారంభించాం. అయితే బ్యాటింగ్లో మరో 10-15 పరుగులు చేయాల్సింది. బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. అసాధారణ ప్రదర్శనతో విజయం దిశగా నడిపించాడు. మా టెయిలెండర్లు సైతం కీలక పరుగులు జోడించారు. గేమ్ను చివరి వరకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే నవాజ్కు చివరి ఓవర్ వరకు బౌలింగ్ ఇవ్వలేదు. భారత బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టాలనేదే ఐడియా. కానీ హార్దిక్ పాండ్యా అద్భుతంగా మ్యాచ్ను ముగించాడు. నసీమ్ షా అదరగొట్టాడు. అతను యువ బౌలర్ అయినా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఎంతో దూకుడు కనబర్చాడు'అని బాబర్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.5 ఓవర్లలో 147 పరుగులకు కుప్పకూలింది. మహమ్మద్ రిజ్వాన్(43), షానవాజ్ దహాని(16) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో భువనేశ్వకుమార్ నాలుగు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా 3 వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. అర్ష్దీప్ సింగ్ రెండు వికెట్లు తీయగా..ఆవేశ్ ఖాన్కు ఓ వికెట్ దక్కింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 19.4 ఓవర్లలో 148 పరుగులు చేసి గెలుపొందింది. బౌలింగ్లో మెరిసిన హార్దిక్ పాండ్యా(17 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 33 నాటౌట్) బ్యాటింగ్లోనూ సత్తా చాటాడు. అతనికి అండగా విరాట్ కోహ్లీ(35), రవీంద్ర జడేజా(35) రాణించారు. పాక్ బౌలర్లలో అరంగేట్ర పేసర్ నసీమ్ షా రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ నవాజ్ మూడు వికెట్లతో చెలరేగాడు.