
మెల్బోర్న్: టీ20 ప్రపంచకప్ 2022లో భారత్తో గెలిచే మ్యాచ్ను చేజార్చుకున్నామని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అన్నాడు. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా అద్భుత బ్యాటింగ్తో తమ పతనాన్ని శాసించారని తెలిపాడు. ఆదివారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలుపొంది శుభారంభం చేసింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన బాబర్ ఆజామ్.. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా జోడీని విడదీయకపోవడమే తమ ఓటమికి కారణమైందన్నాడు.
ఈ జోడీని విడదీసేందుకే స్పిన్నర్ మహమ్మద్ నవాజ్ చివరి వరకు ఆపాల్సి వచ్చిందని స్పష్టం చేశాడు. తన నిర్ణయంలో తప్పులేదని సమర్థించుకున్నాడు. 'మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. క్రెడిట్ అంతా విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాలదే. అసాధారణమైన బ్యాటింగ్తో మా ఓటమిని శాసించారు. కొత్త బంతితో బ్యాటింగ్ అంత సులువు కాదు. మేం కూడా 10 ఓవర్ల తర్వాతనే భాగస్వామ్యాలు అందుకున్నాం. విజయానికి మాకు మంచి అవకాశం లభించింది. మేం మా ప్రణాళికలకు తగ్గట్లు ఆడాం. కానీ విరాట్ కోహ్లీ ఒంటి చేత్తో మ్యాచ్ను మా నుంచి లాగేసుకున్నాడు. మిడిల్ ఓవర్లలో వికెట్ తీయాలనే స్పిన్నర్ నవాజ్ను ఆఖరి ఓవర్కు ఆపాను. ఈ మ్యాచ్లో ఓడినా చాలా సానుకూలంశాలు లభించాయి. ఇఫ్తికర్ అహ్మద్, షాన్ అద్భుతంగా ఆడారు' అని తెలిపాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. షాన్ మసూద్(42 బంతుల్లో 5 ఫోర్లతో 52 నాటౌట్), ఇఫ్తికర్ అహ్మద్(34 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 51) హాఫ్ సెంచరీలతో పాక్ను ఆదుకున్నారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా మూడేసి వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా..నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులు చేసి గెలుపొందింది. విరాట్ కోహ్లీకి అండగా హార్దిక్ పాండ్యా(37 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 40) రాణించాడు.