హైదరాబాద్: సౌద్ షకీల్, మహమ్మద్ రిజ్వాన్ సూపర్ బ్యాటింగ్కు తోడు బౌలర్లు సత్తా చాటడంతోనే వన్డే ప్రపంచకప్ 2023లో శుభారంభం చేసామని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తెలిపాడు. నెదర్లాండ్స్తో ఉప్పల్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన పాకిస్థాన్ 81 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ విజయానంతరం మాట్లాడిన బాబర్ ఆజామ్.. హైదరాబాద్ అభిమానుల మద్దతుకు ఫిదా అవుతున్నట్లు తెలిపాడు. సొంత అభిమానుల్లా తమకు మద్దతు తెలుపుతున్నారని చెప్పిన బాబర్ ఆజామ్.. భారత్ ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తున్నామని తెలిపాడు. 'హైదరాబాద్ అభిమానుల మద్దతు చూస్తుంటే సంతోషం కలుగుతోంది. ఈ నగర ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తున్నాం.

ఈ ఫలితం పట్ల నేను సంతృప్తిగా ఉన్నాను. ఈ విజయం క్రెడిట్ బౌలర్లదే. బౌలింగ్లో అద్భుతంగా మొదలుపెట్టాం. మిడిల్ ఓవర్లలోనూ వికెట్లు తీసాం. బ్యాటింగ్లో మాత్రం ఆరంభంలోనే వికెట్లు కోల్పోయాం. అయినా రిజ్వాన్, షకీల్ అద్భుత బ్యాటింగ్తో జట్టును ఆదుకున్నారు.
సౌద్ షకీల్ ఇన్నింగ్స్ నిర్మించిన తీరు చూస్తేనే అతను ఎంత మెరుగయ్యాడో అర్థమవుతోంది. తొలి 10 ఓవర్లలో మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేసి ప్రత్యర్థిని కట్టడి చేశారు.'అని బాబర్ ఆజామ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 49 ఓవర్లలో 286 పరుగులకు కుప్పకూలింది. మహమ్మద్ రిజ్వాన్(75 బంతుల్లో 8 ఫోర్లతో 68), సౌద్ షకీల్(52 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్తో 68) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మహమ్మద్ నవాజ్(43 బంతుల్లో 4 ఫోర్లతో 39), షాదాబ్ ఖాన్(34 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 32) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన నెదర్లాండ్స్ 41 ఓవర్లలో 205 పరుగులకు కుప్పకూలింది. బౌలింగ్లో 4 వికెట్లతో సత్తా చాటిన బాస్ డీ లీడే(68 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 67)తో పాటు ఓపెనర్ విక్రమ్జీత్ సింగ్(67 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు.
పాకిస్థాన్ బౌలర్లలో హ్యారీస్ రౌఫ్(3/43) మూడు వికెట్లు తీయగా.. హసన్ అలీ(2/33) రెండు వికెట్లు పడగొట్టాడు. షాహిన్ షా అఫ్రిది, ఇఫ్తికర్ అహ్మద్, మహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ తలో వికెట్ తీసారు.