లాహోర్: తమ పేసర్ల అసాధారణ ప్రదర్శనతోనే బంగ్లాదేశ్పై విజయం సాధించామని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తెలిపాడు. విపరీతమైన వేడీ, ఉక్కపోత వాతావరణంలోనూ తమ బౌలర్లు సత్తా చాటారని కొనియాడాడు. ఆసియాకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్తో బుధవారం జరిగిన సూపర్-4 మ్యాచ్లో సమష్టిగా రాణించిన పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ విజయానంతరం మాట్లాడిన బాబర్ ఆజామ్.. ప్రణాళికలకు తగ్గట్లు తమ బౌలర్లు రాణించారని ప్రశంసించాడు. ఈ విజయం అందించిన ఉత్సాహంతో భారత్ను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. 'విపరీతమైన వేడి.. అయినా మా బౌలర్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారు. ఈ విజయం క్రెడిట్ వారిదే. ముందుగా షాహిన్ అఫ్రిది.. ఆ తర్వాత హారీస్ రౌఫ్ నిప్పులు చెరిగారు.

ప్రణాళికల్లో భాగంగానే ఫహీమ్ను తుతి జట్టులోకి తీసుకున్నాం. పిచ్పై గడ్డి ఉండటంతో అతని బౌలింగ్కు సరిపోతుందని భావించి అవకాశం ఇచ్చాం. ఇక్కడ ఎప్పుడు ఆడినా మాకు ప్రేక్షల నుంచి మద్దతు లభిస్తోంది. వాళ్లంతా ఈ మ్యాచ్ను ఆస్వాదించారని ఆశిస్తున్నా. ఈ విజయం మా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది.
భారత్తో మ్యాచ్కు కావాల్సి ఉత్సాహాన్ని అందించింది. ఈ బిగ్ మ్యాచ్కు మేందు అన్ని విధాలుగా సిద్దంగా ఉన్నాం. ఈ మ్యాచ్లో గెలిచేందుకు మా సాయశక్తులా ప్రయత్నిస్తాం.'అని బాబర్ ఆజామ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. 38.4 ఓవర్లలో 193 పరుగులకు కుప్పకూలింది. హ్యారీస్ రౌఫ్(4/19), నసీమ్ షా(3/34) బంగ్లా పతనాన్ని శాసించగా.. షాహిన్ అఫ్రిది, ఫాహీమ్ అష్రఫ్, ఇఫ్తికర్ అహ్మద్ తలో వికెట్ తీసారు.
బంగ్లాదేశ్ బ్యాటర్లలో కెప్టెన్ షకీబ్ అల్ హసన్(57 బంతుల్లో 7 ఫోర్లతో 53), వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్(87 బంతుల్లో 5 ఫోర్లతో 64) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 39.3 ఓవర్లలో 3 వికెట్లకు 194 పరుగులు చేసి గెలుపొందింది.
ఇమామ్ ఉల్ హక్(84 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 78), మహమ్మద్ రిజ్వాన్(79 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 63 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లామ్, మెహ్దీ హసన్ మీరాజ్ తలో వికెట్ తీసారు. పాకిస్థాన్ తమ తదుపరి మ్యాచ్ను ఆదివారం భారత్తో ఆడనుంది.