అహ్మదాబాద్: పేలవ బ్యాటింగే తమ ఓటమిని శాసించిందని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తెలిపాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా శనివారం భారత్తో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన బాబర్ ఆజామ్.. తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయామని తెలిపాడు.
బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ విఫలమయ్యామని అసహనం వ్యక్తం చేశాడు. ఈ తరహా ప్రదర్శన తమ జట్టుకు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పాడు.

'ఈ మ్యాచ్ను మేం అద్భుతంగా ప్రారంభించాం. మంచి భాగస్వామ్యం నెలకొల్పాం. సాధారణ క్రికెట్ ఆడుతూ భాగస్వామ్యాలు నమోదు చేయాలనేది మా బ్యాటింగ్ ప్రణాళిక. కానీ సడెన్గా మా బ్యాటింగ్ విభాగం కుప్పకూలింది. మేం ఆశించిన రీతిలో బ్యాటింగ్ను ముంగించలేకపోయాం. ఈ తరహా ఆట మా జట్టుకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.
మేం మ్యాచ్ను ప్రారంభించిన తీరుకు 280-290 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించాలి. కానీ ఆకస్మాత్తుగా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడం మా ఓటమిని శాసించింది. ఈ లక్ష్యం ఏ మాత్రం సరిపోదు. బంతితో కూడా మేం ఆశించిన స్థాయిలో రాణించలేదు.
కొత్త బంతితోనూ మా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. రోహిత్ శర్మ అద్భుతంగా ఆడాడు. అసాధారణ ఇన్నింగ్స్తో చెలరేగాడు. మేం వికెట్ల కోసం ప్రయత్నించాం. కానీ లభించలేదు.'అని బాబర్ ఆజామ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 42.5 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పాక్ బ్యాటర్లలో కెప్టెన్ బాబర్ ఆజామ్(58 బంతుల్లో 7 ఫోర్లతో 50), మహమ్మద్ రిజ్వాన్(69 బంతుల్లో 7 ఫోర్లతో 49) మినహా అంతా విఫలమయ్యారు.
భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా(2/19), మహమ్మద్ సిరాజ్(2/50), హార్దిక్ పాండ్యా(2/34), కుల్దీప్ యాదవ్(2/35), రవీంద్ర జడేజా(2/38) రెండేసి వికెట్లు తీసారు. 155/2 వికెట్లతో పటిష్టంగా కనిపించిన పాకిస్థాన్ 36 పరుగుల వ్యవధిలోనే 8 వికెట్లు కోల్పోయింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 30.3 ఓవర్లలో 3 వికెట్లకు 192 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. రోహిత్ శర్మ(63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 86) తృటిలో శతకం చేజార్చుకోగా.. శ్రేయస్ అయ్యర్(62 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది రెండు వికెట్లు తీయగా.. హసన్ అలీ ఓ వికెట్ తీసాడు.