ENG vs PAK: వన్డే ప్రపంచకప్ 2023లో సెమీస్ చేరడంపై పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. సెమీస్ బెర్త్ కోసం సాయశక్తులా పోరాడుతామని తెలిపాడు. మెగా టోర్నీలో భాగంగా పాకిస్థాన్ శనివారం ఇంగ్లండ్తో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. సెమీస్ బెర్త్ దక్కాలంటే ఈ మ్యాచ్లో పాకిస్థాన్ అసాధారణ విజయాన్ని అందుకోవాలి.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేస్తే పాకిస్థాన్ భారీ స్కోర్ చేసి ఇంగ్లండ్పై 287 పరుగుల భారీ తేడాతో విజయం సాధించాలి. ముందుగా బౌలింగ్ చేస్తే మాత్రం ఇంగ్లండ్ను వీలైనంత తక్కువ స్కోర్కు ఆలౌట్ చేసి 3.4 ఓవర్లలోనే చేధించాలి. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్పై పాక్ భారీ విజయం సాధించడం అసాధ్యం కాబట్టి ఆ జట్టు కథ ముగిసినట్లేనని అంతా అనుకుంటున్నారు.

శ్రీలంకపై విజయం సాధించి సెమీస్ రేసులో ముందు నిలిచిన న్యూజిలాండ్కు ఢోకా లేదని అభిప్రాయపడుతున్నారు. తమ చివరి లీగ్ మ్యాచ్ నేపథ్యంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన బాబర్ ఆజామ్.. ఇంగ్లండ్పై భారీ విజయం సాధించి సెమీస్ చేరుతామని ధీమా వ్యక్తం చేశాడు. 'క్రికెట్లో ఏదైనా జరగవచ్చు. మేం ఈ టోర్నీని ఘనంగా ముగించేందుకు ప్రయత్నిస్తాం.
నెట్రన్ రేట్ దృష్టిలో పెట్టుకొనే మ్యాచ్ ఆడుతాం. ఫకార్ జమాన్ 20-30 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేస్తే.. మాకు కావాల్సిన రన్రేట్ను అందుకోవచ్చు. ఈ మ్యాచ్లో ఇఫ్తికర్ అహ్మద్, మహమ్మద్ రిజ్వాన్ పాత్ర కూడా చాలా కీలకం. నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. గత మూడేళ్లుగా జట్టును ఎలా నడిపిస్తూ ఆడుతున్నానో అలానే ఆడుతున్నా.

టీవీ ముందు కూర్చొని చాలా విమర్శలు చేయవచ్చు. నాకు సలహా ఇచ్చే వ్యక్తులు నేరుగా నా నంబర్కు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. ప్రస్తుతం నా ఫోకస్ రేపటి మ్యాచ్పై మాత్రమే ఉంది. నా కెప్టెన్సీ భవితవ్యంపై తర్వాత ఆలోచిస్తాను. భారత్లో ఆడిన అనుభవం లేకపోవడం కూడా నా పేలవ ప్రదర్శనకు ఓ కారణం. దాంతో అంచనాలకు తగ్గట్లు రాణించలేకపోయాను.'అని బాబర్ ఆజామ్ చెప్పుకొచ్చాడు.