టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్ తమ వరుస పరాజయాలకు ముగింపు పలికింది. గ్రూప్-ఏలో భాగంగా కెనడాతో మంగళవారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంపై పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ సంతోషం వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఇది సమష్టి విజయమని చెప్పాడు.
జట్టులోని ప్రతీ ఒక్క ఆటగాడు విజయం కోసం తమ వంతు కృషి చేశారని చెప్పాడు. 'ఈ విజయం చాలా సంతోషాన్నిచ్చింది. ఈ విజయం మాకు చాలా ముఖ్యం. టీమ్ సమష్టి ప్రదర్శనతో ఈ విజయం సాధ్యమైంది. ఈ మ్యాచ్లో మేం శుభారంభం అందుకున్నాం. కొత్త బంతితోనే కొన్ని వికెట్లు పడగొట్టాం. నెట్ రన్రేట్ మెరుగు పరుచుకోవాలని మా మదిలో మెదిలింది.

కానీ తొలి 6 ఓవర్లు చాలా కీలకం. దాంతో పవర్ ప్లేలో ఓపికగా ఆడి.. తర్వాతి స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగాలనుకున్నాం. ఇద్దరం అదే మైండ్ సెట్తో ఆడాం. ఫ్లోరిడా పరిస్థితిలు ఇక్కడి కన్నా మెరుగ్గా ఉండాలి. నేను మళ్లీ అదే షాట్ ఆడబోయి ఔటవ్వడంతో తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాను. అందుకే గట్టిగా అరిచేసాను. ఇప్పటికీ నేను జట్టు విజయం కోసం నా సాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాను.'అని బాబర్ ఆజామ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 106 పరుగులు చేసింది. కెనడా ఓపెనర్ ఆరోన్ జాన్సన్(44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 52) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. కెప్టెన్ సాద్ బిన్ జఫర్(21 బంతుల్లో ఫోర్తో 10), కలీమ్ సనా(14 బంతుల్లో సిక్స్తో 13 నాటౌట్) మినహా అంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు.
పాకిస్థాన్ బౌలర్లలో మహమ్మద్ అమీర్(2/13), హ్యారీస్ రౌఫ్(2/26) నిప్పులు చెరగగా.. షాహిన్ షా అఫ్రిది, నసీమ్ షా తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 17.3 ఓవర్లలో 3 వికెట్లకు 107 పరుగులు చేసి గెలుపొందింది. మహమ్మద్ రిజ్వాన్(53 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 53 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. బాబర్ ఆజామ్(33 బంతుల్లో ఫోర్, సిక్స్తో 33) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.