
సిడ్నీ: టీ20 ప్రపంచకప్ 2022లో ప్రేక్షకుల మద్దతుతోనే ఫైనల్ చేరామని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అన్నాడు. వరుసగా రెండు మ్యాచ్లు ఓడి.. సెమీస్ దారులు మూసుకుపోయిన పరిస్థితుల్లో కూడా పాక్ అభిమానులు తమకు అండగా నిలిచారని తెలిపాడు. ముఖ్యంగా న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్కు అధిక సంఖ్యలో హాజరయ్యారని, దాంతో సొంతగడ్డపై ఆడుతున్నామనే ఫీలింగ్ కలిగిందని చెప్పాడు. దాంతో తాము ఒత్తిడికి గురి కాకుండా స్వేచ్చగా ఆడామని వెల్లడించాడు. బుధవారం ఏకపక్షంగా సాగిన ఈ సెమీ ఫైనల్ మ్యాచ్లో సమష్టిగా రాణించిన పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను ఓడించి ఫైనల్కు చేరింది.
ఈ విజయానంతరం తమ విజయంపై స్పందించిన బాబర్ ఆజామ్.. ఫైనల్ చేరడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. ఈ విజయానికి కారణమైన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు. 'ముందుగా మ్యాచ్కు వచ్చి మాకు మద్దతు తెలిపిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. వారు అధిక సంఖ్యలో హాజరై సొంతగడ్డపై ఆడుతున్నామనే ఫీలింగ్ కలిగించారు. దాంతో మేం ఎలాంటి ఒత్తిడికి గురవ్వకుండా స్వేచ్చగా ఆడాం. అటు బంతితో ఇటు బాల్తో మంచి ఆరంభం అందుకున్నాం. ముఖ్యంగా రెండు ఇన్నింగ్స్ల్లో తొలి 6 ఓవర్లలో ఆధిపత్యం చెలాయించాం. ఈ ప్రదర్శనే మమ్నల్ని విజేతగా నిలబెట్టింది.
పవర్ ప్లే అనంతరం బ్యాటింగ్కు కష్టంగా మారింది. మా పేసర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. బ్యాటింగ్లో ప్రణాళికలకు తగ్గట్లే బ్యాటింగ్ చేశాం. హరీస్ అద్భుతంగా ఆడాడు. యువ ఆటగాడైనా.. దూకుడుగా ఆడాడు. ఈ విజయాన్ని మేం ఆస్వాదిస్తున్నాం. అలాగే ఫైనల్పై ఫోకస్ పెడుతాం'అని బాబర్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 152 పరుగులు చేసింది. డారిల్ మిచెల్(35 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 53 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. కేన్ విలియమ్సన్(42 బంతుల్లో ఫోర్, సిక్స్తో 46) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ నవాజ్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 19.1 ఓవర్లలో 3 వికెట్లకు 153 పరగులు చేసింది. మహమ్మద్ రిజ్వాన్(43 బంతుల్లో 5 ఫోర్లతో 57), బాబర్ ఆజామ్(42 బంతుల్లో 7 ఫోర్లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించారు. తొలి వికెట్కు 105 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు తీయగా.. మిచెల్ సాంట్నర్ ఓ వికెట్ పడగొట్టాడు.