తనను కింగ్ అని పిలవద్దని అభిమానులతో పాటు మీడియాను పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజామ్ కోరాడు. తాను కింగ్ కాదని, అది ఒకప్పుడని, ప్రస్తుతం తన బాధ్యతలు వేరే అని స్పష్టం చేశాడు. ఒకప్పుడు నిలకడకు మారు పేరుగా నిలిచిన బాబర్ ఆజామ్ ప్రస్తుతం పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్నాడు. గతంలో నిలకడైన బ్యాటింగ్తో పరుగుల వరద పారించిన బాబర్ ఆజామ్ను ఆ దేశ అభిమానులు కింగ్ అని ముద్దుగా పిలుచుకుంటారు.
పాకిస్థాన్ కోహ్లీ అంటూ కొనియాడుతారు. కానీ గత మూడేళ్లుగా బాబర్ ఆజామ్ దారుణంగా విఫలమయ్యాడు. 2022 డిసెంబర్లో చివరి టెస్ట్ సెంచరీ చేసిన బాబర్ ఆజామ్.. వన్డేల్లో 2023 ఆగస్ట్లో శతకం సాధించాడు.ఆ తర్వాత నిలకడలేమి ఆటతో ఇబ్బంది పడుతున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు సౌతాఫ్రికా, న్యూజిలాండ్తో జరుగుతున్న ముక్కోణపు సిరీస్లోనూ బాబర్ ఆజామ్ తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. రెండు ఇన్నింగ్స్ల్లో అతను 16.50 సగటుతో 33 పరుగులు మాత్రమే చేశాడు.

ప్లీజ్.. అలా పిలవకండి..
న్యూజిలాండ్తో ఫైనల్కు ముందు మీడియాతో మాట్లాడిన బాబర్ ఆజామ్.. తనను ఎవరూ కింగ్ అని పిలవద్దని ఫ్యాన్స్, మీడియాకు రిక్వెస్ట్ చేశాడు. 'దయచేసి నన్ను కింగ్ అని పిలవద్దు. నేను కింగ్ కాదు. ప్రస్తుతం నేను ఆ స్థితిలో లేను. నాపై కొత్త బాధ్యతలు ఉన్నాయి. గతంలో నేను చేసిన పరుగులు, రికార్డులు అన్నీ గతమే. ఇప్పుడు ప్రతీ మ్యాచ్ తాజా సవాలే. నేను ప్రజెంట్తో పాటు భవిష్యత్తుపై ఫోకస్ పెట్టాలి. జట్టుకు ఒక ప్రణాళిక ఉంది. అందుకు తగ్గట్లు నేను ఆడాలి. అఘా సల్మాన్, మహమ్మద్ రిజ్వాన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.'అని బాబార్ ఆజామ్ చెప్పుకొచ్చాడు.
పాకిస్థాన్ ఘన విజయం..
సౌతాఫ్రికాతో బుధవారం జరిగిన కీలక వన్డేలో పాకిస్థాన్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. సౌతాఫ్రికా విధించిన 353 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించి ఫైనల్కు చేరింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 352 పరుగులు చేసింది. కెప్టెన్ టెంబా బవుమా(96 బంతుల్లో 13 ఫోర్లతో 82), యువ ఓపెనర్ మాథ్యూ బ్రిట్జ్కీ(84 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 83), హెన్రీచ్ క్లాసెన్(56 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్లతో 87) హాఫ్ సెంచరీలతో రాణించారు.
చివర్లో కైల్ వెర్రెయిన్(32 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 44 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది(2/66) రెండు వికెట్లు తీయగా.. నసీమ్ షా, కుష్దిల్ షా తలో వికెట్ దక్కించుకున్నారు.
శతక్కొట్టిన రిజ్వాన్, సల్మాన్..
అనంతరం పాకిస్థాన్ 49 ఓవర్లలో 4 వికెట్లకు 355 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్(128 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 122 నాటౌట్), సల్మాన్ అఘా(103 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్స్లతో 134 ) అజేయ శతకాలతో చెలరేగారు. సౌతాఫ్రికా బౌలర్లలో వియాన్ మల్డర్(2/79) రెండు వికెట్లు తీయగా.. కోర్బిన్ బోస్చ్ ఓ వికెట్ పడగొట్టాడు. ఈ విజయంతో శుక్రవారం జరిగే ఫైనల్లో న్యూజిలాండ్తో పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనుంది.