కెప్టెన్ నేను రా అయ్యా..
చివరకు ఫీల్డ్ అంపైర్ సైతం మహమ్మద్ రిజ్వాన్ కెప్టెన్ అనుకొని పొరపాటుపడ్డాడు. దాంతో తీవ్ర అసహనానికి గురైన బాబర్.. కెప్టెన్ నేను రా సామీ అంటూ సైగలు చేస్తూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అసలు ఏం జరిగిందంటే..? శ్రీలంక ఇన్నింగ్స్ సందర్భంగా హసన్ అలీ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని అలీ బౌన్సర్గా సందించగా.. డసన్ షనక కట్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతిని అంచనా వేయడంలో అతను విఫలమవ్వడంతో అది కాస్త కీపర్ రిజ్వాన్ చేతిలో పడింది. అయితే బంతి బ్యాట్కు తగిలిందని భావించిన రిజ్వాన్ కీపర్ క్యాచ్గా అప్పీల్ చేశాడు. కానీ ఫీల్డ్ అంపైర్ అనిల్ చౌదరి నాటౌట్గా ప్రకటించాడు.

అంపైర్ తప్పిదం..
వెంటనే రిజ్వాన్ రివ్యూ కోసం సిగ్నల్ ఇచ్చాడు. అనిల్ చౌదరి సైతం కెప్టెన్ ఎవరా? అనే విషయం మరిచి థర్డ్ అంపైర్ను సంప్రదించాడు. రిప్లేలో బంతి బ్యాట్కు తగలలేదని తేలడంతో పాక్ రివ్యూ వృథా అయ్యింది. అయితే తాను రివ్యూ అడగకుండానే ఎలా సమీక్ష కోరుతారని పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. నిబంధనల ప్రకారం ఫీల్డింగ్ టీమ్ రివ్యూ తీసుకోవాలంటే కెప్టెన్ మాత్రమే కోరాలి. కానీ ఇక్కడ మహమ్మద్ రిజ్వాన్ అడగ్గానే రివ్యూ కోరడం చర్చనీయాంశమైంది.

అప్పుడప్పుడు కెప్టెన్సీ చేయాలి..
ఈ వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. అందుకే అప్పుడప్పుడు ఫీల్డ్లో కెప్టెన్సీ చేయాలని, మొత్తం రిజ్వాన్కు అప్పగించి పక్కన కూర్చుంటే ఇలానే ఉంటుందని సెటైర్లు పేల్చుతున్నారు. గత కొన్ని రోజులు రిజ్వాన్ జోక్యం ఎక్కువైందని, దాంతోనే అంపైర్ అనిల్ చౌదరి అయోమయానికి గురయ్యాడని తెలిపాడు. ఒక కెప్టెన్.. తానే సారథి అని చెప్పుకురావడం ఎంతటి కర్మ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

లంక సునాయసంగా..
ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.1 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. శ్రీలం బౌలర్లలో స్పిన్నర్ వానిందు హసరంగా (3/21) మూడు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. అతనికి తోడుగా మహీశ్ తీక్షణ(2/21), ప్రమోద్ మదుషన్(2/21) రెండేసి వికెట్లు తీయగా.. చమిక కరుణరత్నే, ధనుంజయ డిసిల్వా తలో వికెట్ తీసారు. కెప్టెన్ బాబర్ ఆజామ్(29 బంతుల్లో 2 ఫోర్లతో 30), మహమ్మద్ నవాజ్(18 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 26) మినహా మరెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు.
అనంతరం శ్రీలంక 17 ఓవర్లలోనే 5 వికెట్లకు 124 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఓపెనర్ పాతుమ్ నిస్సంక(48 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 55 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. పాక్ బౌలర్లలో మమమ్మద్ హస్నైన్, హ్యారీస్ రౌఫ్ రెండేసి వికెట్లు తీయగా.. ఉస్మాన్ ఖదీర్ తలో వికెట్ తీసారు.


Click it and Unblock the Notifications
